పాలకులు తీసుకున్న నిర్ణయాలకు ప్రజామోదం దక్కితే ఇక వాటికి తిరుగు ఉండదు. తర్వాత ఏర్పడే ప్రభుత్వాలు ఆ నిర్ణయంపై సమీక్ష చేసే అవకాశం కూడా ఉండదు. ప్రజామోదంతో తీసుకున్న నిర్ణయాలను కదిలిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని తర్వాత ప్రభుత్వాలు వాటి జోలికి వెళ్లవు. జిల్లా పేరు మార్చుతూ నాడు జగన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో.. కూటమి ప్రభుత్వం ప్రజామోదం మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
వైసీపీ హయాంలో వైఎస్సార్ కడప జిల్లా పేరును పూర్తిగా మార్చేశారు. తన తండ్రి పేరు మాత్రమే ఉండాలని అహంభావంతో జిల్లా పేరులో కడప అనే పదాన్నే తొలగించారు. దీనిపై అప్పట్లోనే ప్రజా సంఘాలు అభ్యంతరం తెలిపాయి. వైఎస్సార్ కడప జిల్లాగా కొనసాగించాలని, కడప అనేది ప్రజల భావోద్వేగానికి సంబంధించినది అని నినదించారు. కానీ, జగన్ వినలేదు. ప్రభుత్వం మారాక ప్రజల అభిప్రాయం గౌరవిస్తూ వైఎస్సార్ కడప జిల్లాగా మార్చారు.
గతంలోనే , చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో కడప జిల్లాలో పర్యటించిన సమయంలో తాము అధికారంలోకి వస్తే జిల్లా పేరును పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ అంశంపై మంత్రి సత్యకుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ప్రజల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందటంతో వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చుతూ జీవో జారీ చేశారు.