పోలీసు శాఖలో ఇప్పటికీ జగన్ రెడ్డి కోసం పని చేస్తున్న వారు ఉన్నారని.. సింగయ్య మృతి కేసుతో స్పష్టత వచ్చింది. నడి రోడ్డు మీద జగన్ రెడ్డి కారు వృద్ధుడ్ని తొక్కించి రోడ్డుపక్కన పడేసి పోతే.. ఆ నేరాన్ని ఇతరుల మీద నెట్టేసేందుకు ప్రయత్నించి జగన్ ను కాపాడేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడీ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. జగన్ రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన పోలీస్ ఆఫీసర్లు, వారితో టచ్ లో ఉన్న వైసీపీ నేతల గురించి ఆరా తీస్తోంది.
జగన్ కారు తొక్కేసిందని పోలీసులకు తెలియకుండా ఉంటుందా?
గుంటూరుకు చెందిన ఓ వైసీపీ నాయకునితో పాటు కృష్ణా జిల్లా వైసీపీ నేత తలశిల రఘురాం.. యాక్సిడెంట్ కేసులో జగన్ రెడ్డిని తప్పించేందుకు కుట్ర చేశారు. వారే తమకు అనుకూలమైన పోలీసులతో కలిసి కథ నడిపించారు. ప్రమాదం జరిగిన తర్వాత అసలు సమాచారం పోలీసు ఉన్నతాదికారులకు చేర్చకుండా ఇంటలిజెన్స్ ను కూడా మ్యానేజ్ చేశారు. వైసీపీ నేతలు తాము అనుకున్న విధంగాఓ కమ్మ సామాజికవర్గానికి చెందిన వైసీపీ లీడర్ పేరును ఇరికించేందుకు ప్రయత్నించారు. దేవినేని అవినాష్ అనుచరుడి కారు తొక్కేసిందని ప్రచారం చేశారు. పోలీసులతో చెప్పించారు.
వీడియోలు బయటకు వచ్చే వరకూ పోలీసుల డ్రామాలెందుకు?
గుంటూరు ఎస్పీ వ్యవహారం మరింత వివాదాస్పదమవుతోంది. కింది స్థాయి పోలీసులు ఏ సమాచారం ఇస్తే ఆ సమాచారం బయట పెడతారా లేకపోతే.. ఆయనే చొరవ తీసుకుని జగన్ రెడ్డిని బయటపడేసేందుకు ప్రయత్నించారా అన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాక ముందే ఆయన కారు నెంబర్ ను ప్రకటించారు. ఆ తర్వాత ఆ కారు యజమానిని బాధ్యుడ్ని చేసే పని ప్రారంభించారు. వీడియోలు బయటకు వచ్చే వరకూ అదే జరిగింది. అసలు సింగయ్య జగన్ కారు కింద పడినట్లుగా పోలీసులకు తెలియదంటే ఎలా నమ్ముతారు?. ప్రభుత్వానికే మస్కా కొట్టి జగన్ ను కాపాడాలని ఎందుకు అనుకున్నారు?
పోలీసు వ్యవస్థ ప్రక్షాళన అవసరం!
సింగయ్య మృతి కేసులో పోలీసుల తీరు చూస్తే.. వైసీపీ నేతలు ఇంకా పోలీసుల్లో తమ పలుకుబడి కొనసాగిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఉన్నది వాళ్లేనని వాళ్లతో పని చేయించుకుంటే… వారు ప్రభుత్వం కన్నా.. జగన్ రెడ్డి కోసం పని చేయడం ఎక్కువ అవుతోంది. అందుకే ప్రక్షాళన చేయాల్సిన అవసరం కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.