అమరావతిలో జరుగుతున్న అగ్నిప్రమాదాలు నిస్సందేహంగా కుట్రే. గత పరిణామాలు..అమరావతిపై ద్వేషం చూపించే వారి మనస్థత్వాలను చూస్తే.. కుట్ర లేదని ఎవరూ అనుకోలేరు. కేవలం పైపులే ఎందుకు తగలబడుతున్నాయో సులువుగా అర్థం చేసుకోవచ్చు. పదిహేను రోజుల వ్యవధిలోనే వెలగపూడి వద్ద ఎల్ అండ్ టీ పైపులు, రాయపూడిలో మేఘా ఇంజినీరింగ్కు చెందిన పైపులు తగలబడటం వెనుక విద్రోహ చర్య ఉందనే వాదన వినిపిస్తోంది. గాలిలో నుంచి మంటలు పుట్టుకురావడానికి అవకాశం లేని చోట, ఎండిపోయిన గడ్డిని పైపుల వరకు వరుసగా పేర్చి నిప్పు పెట్టినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఇది ఉద్దేశపూర్వక కుట్ర అని స్పష్టమవుతోంది.
ఈ చిల్లర పనులే వాళ్ల రాజకీయ వ్యూహం
గత ఐదేళ్లలో అమరావతిని స్మశానంగా అభివర్ణించిన వారు, ఇప్పుడు రాజధాని పనులు శరవేగంతో పరుగులు తీస్తుంటే భరించలేకపోతున్నారు. జగన్ హయాంలో అమరావతిపై చూపించిన కక్షను ఇప్పుడు విద్రోహ చర్యల రూపంలో అమలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోలేక, కనీసం సామగ్రిని ధ్వంసం చేయడం ద్వారా పనులను ఆలస్యం చేయాలనే చిల్లర బుద్ధులు దీని వెనుక ఉన్నాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో రాజధాని భూసమీకరణ సమయంలోనూ ఇదే తరహాలో పొలాలకు నిప్పు పెట్టి భయాందోళనలు సృష్టించిన చరిత్రను విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
కుట్రదారులపై నిఘా
ఈ వరుస ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాజధాని అభివృద్ధిని అడ్డుకునే ఏ చిన్న ప్రయత్నాన్ని కూడా సహించేది లేదని అధికారులకు తేల్చి చెప్పారు. దీని వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీయాలని డీజీపీని ఆదేశించడమే కాకుండా, రాజధాని ప్రాంతమంతా డ్రోన్ నిఘా సీసీ కెమెరాల పహారా పెంచాలని స్పష్టం చేశారు. కేవలం విచారణకే పరిమితం కాకుండా, విద్రోహులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేలా నిఘా వర్గాలు రంగంలోకి దిగాలని ఆదేశించారు.
ప్రభుత్వానికి సవాల్గా మారిన భద్రత
వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి. రాజదాని పరుగులు పెడుతుందన్న బాధ వారిలో చాలా ఎక్కువగా ఉంది. కనీసం ఆలస్యం అయినా చేయాలని వారు ఈ కుట్రలకు పాల్పడుతూ ఉంటారు. వీరిని హెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేయాలి. మరో ప్రమాదం జరిగినా అది ప్రభుత్వ వైఫల్యం కిందకే వస్తుంది.

