పోలీసులు ఓ వృద్ధ రైతును మెడపెట్టి బయటకు గెంటేసిన వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలానికి కారణం అయింది. భూభారతి చట్టం తెచ్చినందున నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సుల్లో తన సమస్యను చెప్పుకునేందుకు నిర్మల్ జిల్లాలో ఓ రైతు ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చాడు. అక్కడ ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆ వృద్ధరైతును మెడపట్టి బయటకు గెంటేశారు. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో ప్రభుత్వంపై అందరూ విరుచుకుపడ్డారు. ఆ పోలీసును సస్పెండ్ చేశారు. కానీ జరగాల్సినా నష్టం జరిగింది.
సామాన్యులపై చూపించాల్సింది ఫ్రెండ్లీ పోలీసింగ్
ప్రజలు రకరకాల సమస్యలతో ఉంటారు. వారి గోల వారిది. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాలు చేసే తప్పులను సవరించుకోవడానికి వారు రోజుల తరబడి కార్యాలాయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. తప్పు ప్రభుత్వం, అధికారులు చేస్తారు.. బాధితులుగా ప్రజలు నిలుస్తారు. ఇలాంటి వారు ఆఫీసులకు వచ్చినప్పుడు ఛీత్కారాలు ఎదురవుతాయి. తప్పు చేసిన వాడే దిద్దడానికి సతాయిస్తాడు. ఇలాంటి విషయాల్లో ప్రజలకు కోపం వస్తుంది. ఇలాంటి సామాన్యుల విషయంలో పోలీసులు ప్ఱెండ్లీ పోలీసింగ్ చూపించాలి. అది వారి బాధ్యత కూడా. కానీ నిర్మల్ లో రాంచందర్ అని అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ అన్ని హద్దులూ దాటిపోయారు. 90 ఏళ్ల వృద్ధుడిపై ప్రతాపం చూపించారు.
నేరస్తులతో కఠినంగా ఉండాలి!
ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అందరికీ వర్కవుట్లు కాదు. నేరస్తులకు భయం ఉండాలి. పోలీసులు ఆ భయాన్ని కొనసాగించాలి. కానీ సామాన్యుల విషయంలో మాత్రం కాదు. దొంగలు, తప్పుడు పనులు చేసేవారికి అమ్మో పోలీస్ అనే భయం ఉండేలా కఠినంగా వ్యవహరించాలి. కానీ పోలీసులు ఇలాంటి వారికి పలుకుబడి ఉంటుందని రాజకీయ నేతల మద్దతు ఉంటుందని వారితో సౌమ్యంగా ఉండి.. ఏ అండ ఉండని సామాన్యులపై జులుం ప్రదర్శించడం మాత్రం పోలీసుల ఇమేజ్ ను మసక బారుస్తుంది.
పోలీస్ సంస్కరణలు అత్యవసరం
పోలీసు శాఖలో సంస్కరణలు చేపట్టాల్సిన అత్యవసం కనిపిస్తోంది. తప్పు చేసిన ఒక్క ఏఎస్ఐను బదిలీ చేయడం వల్ల ..చర్యలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. పోలీస్ శాఖలో సీరియస్ గా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సామాన్యులకు ఫ్రెండ్లీ పోలీసింగ్.. నేరస్తులకు కఠిన చర్యలు తీసుకునే భయం కల్పించే పోలీసింగ్ విధానాన్ని పాటించాల్సి ఉంది. బలహీనులపై దాడి చేస్తే అది పోలీస్ పవర్కే అవమానం.