రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను నిజం చేస్తూ విశాఖ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గత ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్న ప్రత్యర్థులు.. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు , మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇప్పుడు ఒకే వేదికపై చెట్టాపట్టాల్ వేసుకుని కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సన్ రే రిసార్ట్స్లో జరిగిన గంటా శ్రీనివాసరావు దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఈ అరుదైన కలయికకు వేదికయ్యాయి.
ఎన్నికల ప్రచారంలో భీమిలి గడ్డపై వీరిద్దరి మధ్య సాగిన మాటల యుద్ధం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన ఈ ఇద్దరు నేతలు, ఇప్పుడు పాత పగలను పక్కనపెట్టి చిరునవ్వుతో పలకరించుకున్నారు. శేషం. గంటా దంపతుల వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన అవంతి శ్రీనివాసరావు, ఆత్మీయంగా గడిపిన తీరు చూస్తుంటే రాజకీయ వైరం కేవలం ఎన్నికల వరకేనని, వ్యక్తిగత బంధాలకు తాము ప్రాధాన్యత ఇస్తామని నిరూపించినట్లయింది.
ఈ వేడుకలో కేవలం అవంతి మాత్రమే కాకుండా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వంటి ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు. రాజకీయంగా భిన్న ధృవాలుగా ఉన్న నేతలందరూ ఒకే చోట చేరి విందు వినోదాల్లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నిజానికి వీరిద్దరూ మొదటి నుంచి సన్నిహితులు. ప్రజా రాజ్యంలో ఇద్దరూ గెలిచారు. ఇద్దరూ కాంగ్రెస్.. టీడీపీలోకి వచ్చారు. తర్వాత తన అవకాశాల్ని గంటా తీసుకుంటున్నారని కినుక వహించిన ఆయన వైసీపీలో చేరారు. వైసీపీ తరపున మంత్రిగా కూడా చేశారు కానీ పార్టీ ఓడిపోగానే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు టీడీపీ లేదా జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గంటాతో మళ్లీ పాత సంబంధాలను పునరుద్ధరించుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన త్వరలో కూటమిలో ఏదో ఓ పార్టీలో చేరే అవకాశం ఉంది.
