జూబ్లిహిల్స్ ఉపఎన్నిక మాజీ క్రికెటర్ అజహరుద్దీన్కు కొత్త ఆశలు రేపుతోంది. అక్కడి నుంచి గత ఎన్నికల్లో ఆయనే పోటీ చేశారు. చివరి క్షణంలో టిక్కెట్ ఖరారు చేయడంతో ఓడిపోయారు. పదహారు వేల ఓట్లతేడాతో ఓడిపోయారు. అప్పట్లో చివరి క్షణంలో టిక్కెట్ ఖరారు చేశారని ఇప్పుడు చాలా కాలంగా అక్కడే పని చేసుకుంటున్నాను కాబట్టి గెలిచి తీరుతానని ఆయన అంటున్నారు.
అయితే అజారుద్దీన్ టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం పెరగడంతో మీడియా సమావేశాలు పెట్టి తానే పోటీ చేస్తానని తనకు రేవంత్, రాహుల్, వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ సపోర్టు ఉందని ఆయన చెబుతున్నారు. అయితే ఈ సారి జూబ్లిహిల్స్ టిక్కెట్ ఎవరికి ఇవ్వాలన్న మజ్లిస్ సూచన మేరకు జరిగే అవకాశం ఉంది. జూబ్లిహిల్స్లో మజ్లిస్ ఎవరికి సపోర్టు చేస్తే వారికి ప్లస్ అవుతుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు సపోర్టు చేసింది. కానీ మజ్లిస్ అజహర్ కు టిక్కెట్ విషయంలో కాంగ్రెస్ కు ఎలాంటి సంకేతాలు పంపుతారన్నది సస్పెన్స్ గా మారింది.
కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కోటాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. కాంగ్రెస్ కు మైనార్టీ ఎమ్మెల్యేలు లేరు. గ్రేటర్ పరిధిలోనూ ఓ మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. ఇక్కడా ఎమ్మెల్యేలు లేరు. అందుకే రెండు కోణాల్లోనూ.. జూబ్లిహిల్స్ నుంచి గెలిచే కాంగ్రెస్ అభ్యర్థికి మంత్రి పదవి ఖాయం అనుకోవచ్చు. అందుకే చాలా మంది మైనార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి జూబ్లిహిల్స్ లోనూ గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు.