పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి ఓ సుదూర లక్ష్యం. ప్రజాస్వామ్యంలో ఏదీ అసాధ్యం కాదు. కానీ పులివెందులలో గెలవాలంటే మాత్రం ఎన్నో రాజకీయాలు చేయాలి. ప్రత్యర్థిని బట్టి రాజకీయాలు చేయాలి. ఇప్పుడు దానికి తగ్గట్లుగా ప్రయత్నిస్తున్నారు. బీటెక్ రవి ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఆయన టార్గెట్ వచ్చే ఎన్నికలు కాదు. ఉపఎన్నికలు.
ఉపఎన్నికలు ఖాయంగా వస్తాయంటున్న టీడీపీ
పులివెందులకు ఉపఎన్నికలు వస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీకి హాజరు కాని జగన్ పై నిబంధనల ప్రకారం అనర్హతా వేటు పడుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇప్పటికే ప్రకటించారు. అయితే జగన్ మాత్రం తాను వచ్చేది లేదు చేతనైంది చేసుకోండని సవాల్ చేశారు. అనర్హతా వేటు పడకుండా ఒక ఆప్షన్ ఉంది. లీవ్ లెటర్ రాసి స్పీకర్ అనుమతి తీసుకోవడం. స్పీకర్ అనుమతితో సభకు డుమ్మా కొడితే అనర్హతా వేటు పడదు. కానీ జగన్ అలా లేఖ రాయడం ఆయన మనస్థత్వానికి విరుద్ధమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ క్యాడర్ ను చేర్చుకుంటున్న టీడీపీ
బీటెక్ రవి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీకి బలమున్న గ్రామాల్లో, ఏకపక్షంగా ఓట్లు వేసే గ్రామాల్లో కొంత మందిని ఆకర్షిస్తున్నారు. ఎంత కాలం ఒకరే అధికారం అనుభవిస్తారు .. మీ గ్రామంలో మీరు పెత్తనం చేసే సమయం వచ్చిందని చెబుతున్నారు. ఇలా ఆయన చాలా గ్రామాల్లో ఏకపక్షంగా ఉండకుండా పార్టీకి సానుభూతిపరుల్ని పెంచుతున్నారు. నీటి సంఘాల ఎన్నికలను ఇందుకు ఉపయోగించుకున్నారు. అన్ని చోట్లా.. తమ పార్టీ తరపున ఏకగ్రీవం చేశారు. అందులో ఎక్కువ ఏకపక్ష గ్రామాల్లో వైసీపీ నుంచి వచ్చిన వారు ఉన్నారు. బిల్లులు రావాల్సిన వారు ఇప్పటికే బీటెక్ రవితో టచ్ లోకి వచ్చారు.
పులివెందుల వైసీపీ మూడు ముక్కలు
గతంలోలా ఇప్పుడు వైసీపీ క్యాడర్ లేదు. వైఎస్ కుటుంబంలో వచ్చిన విబేధాల కారణంగా క్యాడర్ కూడా చీలిపోయింది. అప్పటికీ చాలా మందిలో అసంతృప్తి ఉంది. తమకు ఏమీ చేయలేని ఫీలవుతున్నారు. వారంతా బీటెక్ రవి వైపు మొగ్గుతున్నారు. కొంత మంది షర్మిల వైపు ఉన్నారు. మరికొంత మంది అవినాష్ రెడ్డి వైపు ఉన్నారు. జగన్ తరపున పనులు చక్కబెట్టేది అవినాష్ రెడ్డినే. జగన్ కంటూ ప్రత్యేకంగా వర్గం లేదు. అవినాష్ రెడ్డి ఒత్తిళ్ల కారణంగా లైట్ తీసుకుంటే ఫలితం మారిపోతుంది. అందుకే ఉపఎన్నికలు వస్తే జగన్ కు అంత ఈజీ కాదన్న చర్చ అప్పుడే ప్రారంభమయింది.