థియేటర్ వ్యవస్థ మొత్తం కుప్పకూలే ప్రమాదాన్ని నిర్మాతలు ఇప్పుడు గ్రహిస్తున్నారు. థియేటర్లే లేకపోతే సినిమాలకు మనుగడ ఎక్కడ? అందుకే ఎలాగైనా ఈ వ్యవస్థకు మరమత్తులు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఎగ్జిబీటర్లకూ, డిస్టిబ్యూటర్లకూ మధ్య తగాదా ఆగడం లేదు. పర్సంటేజీ, అద్దె విధానాలపై ఎడతెగని చర్చ నడుస్తూనే ఉంది. కాకపోతే పరిస్థితి చెక్కబడాలంటే ఈ ఒక్క సమస్య పరిష్కారమైతే చాలదు. అసలు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడానికి ఏం చేయాలి? అనేది ఆలోచించాలి. థియేటర్లకు ఇప్పుడు కావాల్సింది పర్సంటేజో, రెంటల్ సిస్టమో కాదు. కంటెంట్. పెద్ద హీరోలు విరివిగా సినిమాలు చేస్తేనే థియేటర్లకు కంటెంట్ వస్తుంది. ఇదే విషయాన్ని బన్నీ వాస్ కూడా ఒప్పుకొంటున్నారు. హీరోలు ముందుకొచ్చి స్పీడుగా సినిమాలు చేయాలని, లేదంటే ఇప్పుడున్న సింగిల్ స్క్రీన్స్ లో 90 శాతం త్వరలో మూతబడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బన్నీ వాస్ ఓ ట్వీట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
”ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది” అంటూ ట్వీట్ చేశారు బన్నీ వాస్.
బన్నీ వాస్ చెప్పింది అక్షరాలా నిజం. ఓటీటీలకు చెక్ పెట్టి, థియేటర్లకు కంటెంట్ ఇవ్వగలిగితే ఇండస్ట్రీలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ విషయంపై హీరోలంతా సీరియస్ గా ఆలోచించుకొని, ఓ నిర్ణయం తీసుకొంటే బెటర్.