లిక్కర్ స్కామే లేదని జగన్ రెడ్డి అంటున్నారు.. మళ్లీ నేను లిక్కర్ స్కాంలో రహస్యాలు చెప్పడానికి టీడీపీ నేతలతో కలిశానని ప్రచారం చేస్తున్నారు .. ఏం లేనప్పుడు ఏం చెబుతానని విజయసాయిరెడ్డి వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. టీడీ జనార్దన్ తో విజయసాయిరెడ్డి సమావేశం అయ్యారని.. ఆయన చంద్రబాబుతో లొంగిపోయారనడానికి ఇంత కంటే సాక్ష్యం ఏమి కావాలని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. దీనిపై విజయసాయిరెడ్డి కాస్త శాంతంగానే స్పందించారు కానీ..నేరుగా తనను గెలుక్కుంటే అసలు నష్టం జగన్ రెడ్డికే అని సూటిగా… సుత్తి లేకుండా చెప్పారు.
తనకు సంబంధం లేని కేసుల్ని నెత్తి మీద వేయడానికి కోటరీ ప్రయత్నించిందని తాను ఎందుకు వేసుకుంటానని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పిలిచి ఆ పని చేయమంటే.. తనపై ఆ కేసుల్ని వేసుకునేవాడ్నని.. గతంలోనే 21 కేసులని భరించానని ఆయన చెప్పుకొచ్చారు. అంటే జగన్ రెడ్డి కోసమే గతంలో కేసుల్ని తన మీద వేసుకున్నానని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. కోటరీ ఇప్పటికీ తనపై కుట్రలు చేస్తోందన్నట్లుగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. తాను ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లానని అక్కడకు టీడీ జనార్ధన్ వస్తారని తనకు తెలియదన్నారు. తమ మధ్య ఏ చర్చలూ జరగలేదని.. స్పష్టం చేశారు. తాను కలవాలనుకుంటే నేరుగా చంద్రబాబు, లోకేష్ ను కలుస్తాను కానీ మధ్యలోని వ్యక్తులతో ఎందుకు కలుస్తానని ప్రశ్నించారు.
తాను ఇప్పుడు రాజకీయాల్లో లేనని చంద్రబాబు, లోకేష్ తనకు రాజకీయ ప్రత్యర్థులు కూడా కాదని స్పష్టం చేశారు. కోటరీ ఇంకా జగన్ ను ముంచే ప్రయత్నాల్లో ఉందని.. అందుకే ఇలా చేస్తున్నారని విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. 3 తరాలుగా అ కుటుంబానికి సేవచేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి పక్కన పెట్టారని.. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెస్నుపోటు దారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా ? అని ప్రశ్నించారు.
విజయసాయిరెడ్డిని ఎందుకు టీడీపీకి అమ్ముడుపోయారని ప్రచారం చేస్తున్నారో కానీ అంతిమంగా అది జగన్ కు సమస్యలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డికి తిక్కరేగేలా కోటరీ వ్యవహరిస్తోంది.