హైదరాబాద్లోని దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు అయింది. హైడ్రా ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు వెంకట్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.
2014లోనే హెచ్ఎండీఏ దుర్గం చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. అయినప్పటికీ, నిందితులు దాదాపు 5 ఎకరాల చెరువు శిఖం భూమిని మట్టి మరియు రాళ్లతో నింపి ఆక్రమించారు. ఈ ఆక్రమిత స్థలాన్ని ఎస్టీఎస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పార్కింగ్ కోసం వినియోగిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.దుర్గం చెరువు ఆక్రమణలు 2014 నుంచే కొనసాగుతున్నాయని, దీని ద్వారా నిందితులు నెలకు సుమారు 50 లక్షల రూపాయల వరకు అక్రమ ఆదాయం గడిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
మాదాపూర్ ఇన్-ఆర్బిట్ మాల్ సమీపంలోని ఈ స్థలంలో ఐటీ కంపెనీలు మరియు పాఠశాలల వాహనాల పార్కింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇటీవల హైడ్రా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో ఈ 5 ఎకరాల అక్రమ ఆక్రమణలను తొలగించి, చెరువు భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే కబ్జా ఆరోపణలను కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. భూమి పూర్తిగా తమ స్వంతమైందని… ఆ భూమిని గతంలో ఆక్షన్ ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, సుమారు ఎనిమిదేళ్ల క్రితమే టీడీఆర్ కూడా మంజూరు అయిందని ప్రకటించారు. అదే ప్రాంతంలో హీరో బాలకృష్ణకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా భూములు ఉన్నాయని కొత్త ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. అక్కడ తనకు మరికొంత భూమి ఉందని.. ఆ భూమిని తాను 2004లో కొనుగోలు చేశానని, అది FTL పరిధిలో ఉందని తెలిసిన వెంటనే ప్రభుత్వానికి తిరిగి అప్పగించానని తెలిపారు.
ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి బాలకృష్ణ భూముల్ని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంటుందా అన్న చర్చ ప్రారంభమయింది.
