తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలలో నాన్ సీరియస్ కేటగిరిని చంద్రబాబు రెడీ చేస్తున్నారు. ప్రజల పనులు, పార్టీ పనులు, ఎమ్మెల్యేగా బాధ్యతల నిర్వహణ విషయంలో సీరియస్ నెస్ లేకుండా సొంత పనులతో పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడానికి అలవాటు పడిన వారికి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండో తేదీ నుంచి టీడీపీ నిర్వహించనున్న .. ఏడాది పాలన విజయాల ప్రచార కార్యక్రమంపై చంద్రబాబు ప్రత్యేక సమావేశం పెట్టారు. కానీ ఈ సమావేశానికి పదిహేను మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. మొత్తం ఆహ్వానించిన వారిలో యాభై మంది రాలేదు.
వీరిలో కొంత మంది వచ్చి సంతకాలు చేసి వెళ్లారు. కొంత మంది కాసేపు ఉండి వెళ్లారు. వీరందరి జాబితాలను చంద్రబాబు సేకరించారు. అదే విషయాన్ని ముగింపు సందర్భంగా చెప్పారు. కొంత మంది గుళ్లకు వెళ్లామని.. మరికొంత మంది విదేశీ పర్యటనలకు వెళ్లామని సమాచారం ఇస్తున్నారని.. పార్టీ కార్యక్రమం కంటే అవే ముఖ్యమనుకుంటే చేసుకోవచ్చన్నారు. విదేశీ పర్యటనలకు వెళ్లేవాళ్లు.. నాటా, టాటా సభలకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారి గురించి కూడా తెలుసని.. అలాంటి వారికి టాటా చెప్పేస్తానని హెచ్చరించారు.
చంద్రబాబు పార్టీ పరమైన కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తే సహించకూడదని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండని వారిని వదులుకునేందుకు కూడా సిద్ధమని చెబుతున్నారు. ఇప్పటికి ఏడాదే అయింది కాబట్టి.. హెచ్చరికలు జారీ చేస్తున్నారని.. సీరియస్ గా తీసుకోని వారి విషయంలో.. తర్వాత ఎంత ఒత్తిడి చేసినా ప్రయోజనం ఉండదని అంటున్నారు.