వై నాట్ గొడ్డలిపోట్లు కాదు..ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ విధానమని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. మహానాడు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. కడపలో మహానాడా అని మోమ్దట అందరూ అనుకున్నారని కానీ, కడప గడ్డ టీడీపీ అడ్డా అనేది నిరూపితమైందని పేర్కొన్నారు. కడప జిల్లాలో పదికి 7 స్థానాల్లో గెలిచాం..2029ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు తన ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూనే, వైసీపీ, జగన్ పై ఫైర్ అయ్యారు.ల్యాండ్, శాండ్, మైన్ దోచేసుకున్నారని,రాష్ట్రంలో ఎక్కడ చూసిన జే బ్రాండ్ తో నాసిరకం మద్యం వ్యాపారం చేశారని మండిపడ్డారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేసిన జగన్ ఎలాంటివాడో అర్థం చేసుకోవచ్చు అన్నారు. పేదల కడుపు నింపడాన్ని ఇష్టపడని జగన్ ఏపీకి అక్కర్లేదని చెప్పారు. టీడీపీ అంటే ప్రజల పార్టీ.. ప్రజల కోసం ఆలోచించే పార్టీ స్పష్టం చేశారు.
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు టీడీపీ పార్టీ ఆవిర్భవించిందన్న చంద్రబాబు..పేద ప్రజల జీవన ప్రమాణాలు మార్చేందుకు ఇటుక ఇటుక పేర్చుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. పరిపాలన ఎలా చేయకూడదో జగన్ పాలన ఓ కేస్ స్టడీ అని వివరించారు. నా కష్టం నా కోసం కాదు..నన్ను నమ్ముకున్న జనం కోసమని చంద్రబాబు స్పష్టం చేశారు.