తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయడం లేదన్నది చాలా మందికి సస్పెన్స్ గా ఉంది. బలమైన కారణాలు ఉన్నాయని అవేంటో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారన్నట్లుగా తాజా పరిణామాలు జరుగుతున్నాయి. కేబినెట్లోకి కొత్తగా కవిత పేరు వినిపిస్తోంది. ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి కవిత కాంగ్రెస్ లో చేరబోతున్నారని ఆమెకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది.
ఆరుగురు ఎమ్మెల్యేలతో వెళ్తే మంత్రి పదవి
కవిత కాంగ్రెస్ హైకమాండ్ ముందు ప్రతిపాదనలు పెట్టిందన్న ప్రచారం జరిగింది. ఆంధ్రజ్యోతి ఈ మేరకు ఓ కథనం రాసింది. దాన్ని కవిత ఖండించలేదు. కనీసం తన వివరణ అడగలేదని కోపగించుకున్నారు. జర్నలిజం కాదు..శాడిజమన్నారు. అంతా చెప్పారు కానీ ఆ స్టోరీలో నిజం లేదని మాత్రం అనలేదు. దాంతో ఆంధ్రజ్యోతి మరింత సమాచారం పచ్చింది. కవిత ఆరుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లో చేరే ప్రతిపాదన పెట్టారు. దానికి మంత్రి పదవి ఆఫర్ తీసుకున్నారు. అన్ని వైపుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆ కథనం సారాంశం.
బీఆర్ఎస్ లో ఎప్పటికీ మంత్రి చాన్స్ రాదు!
భారత రాష్ట్ర సమితిలో అసలు ప్రాధాన్యత లేదని కవిత భావిస్తున్నారు. నిజానికి ఆమెను రాజకీయాల నుంచి వైదొలగాలని ఒత్తిడి చేస్తున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. అందుకే తన దారి తాను చూసుకోవాలనుకుంటున్నారు. నేరుగా ముఖ్యమంత్రి కావడం కష్టం కాబట్టి మంత్రి పదవి ఆశలు పెట్టుకుని ఉండవచ్చు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితిలో కూడా ఎప్పటికీ మంత్రి చాన్స్ రాదు. కేటీఆర్ సీఎం అయితే.. హరీష్ కు చాన్స్ వస్తుంది. కుటుంబసభ్యులకు మరో పోవా అని పక్కన పెడతారు. కేటీఆర్ మరో పవర్ సెంటర్ కు చాన్స్ ఇవ్వరు. ఎలా చూసినా బీఆర్ఎస్ లో ఆమె ప్రాధాన్యం చివరిలోనే ఉంటుంది.
కవితను చేర్చుకుని కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకుంటుందా ?
కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే.. కాస్త భిన్నంగా ఉంటుంది. నిజానికి బీఆర్ఎస్ ను.. కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి ఉంది. కానీ కేసీఆర్ మోసం చేశారన్న ఆగ్రహం కాంగ్రెస్ హైకమాండ్ లో ఉంది. ఇప్పుడు కవితను చేర్చుకోవడం ద్వారా.. కేసీఆర్ కు టిట్ ఫర్ టాట్ సమాధానం ఇచ్చినట్లవుతుందన్న అభిప్రాయం ఉంది. కవిత తన కాంగ్రెస్ లో సంప్రదింపుల వార్తలను ఖండించి.. తాను బీఆర్ఎస్ లో ఉంటానని ప్రకటన చేసే వరకూ ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి. కాంగ్రెస్ మంత్రి పదవుల్ని కూడా భర్తీ చేయాల్సి ఉంది.