‘దండుపాళ్యం’ సిరీస్… ఓ వైబ్రేషన్ సృష్టించింది. క్రైమ్ కథలు ఇష్టపడేవాళ్లకు దండుపాళ్యం, దండుపాళ్యం 2 బాగా నచ్చాయి. ఆ సినిమాల బడ్జెట్తో పోలిస్తే.. భారీ లాభాలను ఆర్జించినట్టే. ఇప్పుడు ‘దండు పాళ్యం 3’ వస్తోంది. దీని తరవాత దండుపాళ్యం సిరీస్ని కొనసాగించను అని దర్శకుడు శ్రీనివాసరాజు చెప్పేశాడు. అయితే ఇప్పుడు ‘దండుపాళ్యం 4’ అనే సినిమా ఒకటి వస్తుందంటూ.. కెటి నాయర్ అనే దర్శకుడు ప్రకటించాడు. బుధవారం హైదరాబాద్లో ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. దండుపాళ్యం సిరీస్లో నటించిన రవికాలే, మకరంద్ దేశ్ పాండే, పూజా గాంధీ.. వీళ్లంతా పార్ట్ 4లోనూ నటిస్తారని చిత్రబృందం కూడా చెప్పింది.
అయితే ఇప్పుడు దండుపాళ్యం దర్శకుడు శ్రీనివాసరాజు… ‘దండుపాళ్యం 4’ టీమ్పై ఫైర్ అవుతున్నాడు. తమ అనుమతి లేకుండా.. టైటిల్ని ఎలా వాడుకుంటారంటూ ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు.. రవికాలే, మకరంద్ దేశ్ పాండే, పూజా గాంధీ.. వీళ్లు కూడా రివర్స్ అవుతున్నారు. ‘మేం ఈ సినిమాలో నటిస్తామని చెప్పలేదు… అలాంటప్పుడు పోస్టర్లపై మా బొమ్మలు ఎలా వేస్తారు’ అంటూ ప్రశ్నిస్తున్నారు. దండుపాళ్యం 4 కూడా తీసే ఉద్దేశంలో ఉన్న శ్రీనివాస రాజుకి… తన పేరు మరొకరు వాడుకోవడం నచ్చడం లేదు. దీంతో ఆయన నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది.