ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని అనుకున్నారు. కానీ, విచారణలో పోలీసులు అడిగే ప్రశ్నలకు తన ఇంటలిజెన్స్ తెలివితో ప్రభాకర్ రావు సమాధానాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ఐబీ చీఫ్ గా పని చేసిన ఆయనకు ఈ కేసులో దొరక్కుండా ఉండాలంటే ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పాలి? ఏ ప్రశ్నను దాటవేయాలి అనేది పక్కాగా తెలిసి ఉంటుంది. అందుకే తప్పించుకునేలా ప్రభాకర్ రావు సమాధానాలు చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. విచారణ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు పోలీసులు. అయితే, పోలీసుల ప్రశ్నలకు ప్రభాకర్ రావు చాకచక్యంగా సమాధానాలు చెబుతున్నారని అంటున్నారు. హార్డ్ డిస్క్ లకు సంబంధించి ప్రశ్నిస్తే వాటిపై సమాధానం చెప్పకుండా మౌనం వహించారట. ఎస్ఐబీ చీఫ్ గా పని చేసినప్పటికీ తను మాత్రమే ఫైనల్ కాదని, తనపై ఇంకా ఉన్నతాధికారులు ఉన్నారని ప్రభాకర్ రావు సిట్ విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను చేసిన ప్రతి పని వారందరికీ తెలుసు అని, వారికి తెలియకుండా తాను ఏం చేయలేదని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ప్రభాకర్ రావు విచారణపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఆయన మామూలోడు కాదని, తమలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురుపోసుకున్నారని విమర్శించారు. అమెరికాలో ప్రభాకర్ రావుకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ తంతు పూర్తి అయిందని, ఆ తర్వాతే ఆయన పథకం ప్రకారం లొంగిపోయి విచారణకు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు నిబంధనలకు లోబడి ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. ఆయనతోపాటు వెనక ఉన్న సూత్రధారులను కూడా దోషులుగా తేల్చాల్సిందేన్నారు.