పవన్ కల్యాణ్ `రిటర్న్ గిఫ్ట్` ఎఫెక్ట్ బాగానే పని చేస్తోంది. నిన్నటికి నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. `ఆ నలుగురు`లో నేను లేను.. అంటూ చేతులెత్తేశారు. అంతేకాదు. పవన్ కోపంలో అర్థం ఉందన్నారు. ఇప్పుడు దిల్ రాజు వంతు వచ్చింది. ఆయన కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. `పవన్ పెద్దన్న లాంటి వాడు. ఆయన తిడితే పడతాను. ఆయనకు కోపం వచ్చేలా ఓ ఎపిసోడ్ జరిగింది` అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. రాంగ్ కమ్యునికేషన్ వల్లే ఇదంతా జరిగిందని, థియేటర్లు బంద్ చేసే ఉద్దేశం ఎవరికీ లేదని, అసలు పవన్ కల్యాణ్ సినిమా విడుదల అవుతుంటే, థియేటర్లు మూసేసే ధైన్యం ఎవరూ చేయరని క్లారిటీ ఇచ్చారు.
అసలు థియేటర్ల బంద్ వ్యవహారం ఎక్కడ మొదలైంది, ఎలాంటి టర్న్లు తీసుకొంది, దానికి కారణం ఎవరూ అంటూ ఈ 45 నిమిషాల ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చుకొంటూ వెళ్లారు. ఏ ఎపిసోడ్ లోనూ తాను లేనని స్పష్టం చేశారు. థియేటర్ల బంద్ అనే విషయం బయటకు వచ్చినప్పుడు ఛాంబర్ స్పందించి ఉంటే బాగుండేదని, అలాంటిది ఏం లేదని క్లారిటీ ఇస్తే ఇలాంటి సమస్య వచ్చేది కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. మీడియా కూడా సంయమనంతో ఉండాలని, వీలైతే సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నించాలని కోరారు.
నైజాంలో తనకు 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయని, సునీల్, సురేష్ బాబు చేతుల్లో 90 థియేటర్లు ఉన్నాయని, మిగిలిన 270 థియేటర్లు ఓనర్ల చేతుల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్య వస్తే వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని కలుస్తున్నారని, అంతే తప్ప సమిష్టిగా వెళ్లడం లేదన్న నిజాన్ని దిల్ రాజు ఒప్పుకొన్నారు. నిర్మాతలంతా పెట్టాల్సిన ప్రెస్ మీట్ ఇదని, కానీ ఎవరికి వారే వ్యక్తిగతంగా మీడియాతో మాట్లాడుతున్నారని, ఎవరేం మాట్లాడతారో అనే భయం వల్లే ఇదంతా జరుగుతుందని, అందరూ కలిసి కట్టుగా ఉండాలని, కానీ అది కురదడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పర్సంటేజీ – అద్దె విధానాలపై ప్రస్తుతం రగడ జరుగుతోంది. దీనిపై కూడా దిల్ రాజు తన స్పష్టమైన అభిప్రాయాల్ని తెలియజేశారు. నూటికి 90 శాతం థియేటర్లు పర్సంటేజీ విధానంపైనే ఆడుతున్నాయని, పది సినిమాలు మాత్రమే అద్దె చెల్లిస్తున్నాయని దీనిపై అందరికీ అసంతృప్తి ఉందని, అందరూ కూర్చుని మాట్లాడుకొంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదన్నారు. థియేటర్ల బంద్ ఎప్పటికీ జరగదని, నిర్మాతలంతా కలిసి షూటింగులు ఆపుకొన్నా సమస్యలు పరిష్కారం కాలేదని, అలాంటప్పుడు థియేటర్ల బంద్ వల్ల ఒరిగేదేం ఉండదన్నారు.