“ఏదైనా కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిదనే ముద్ర వేయాలి” అనే ఓ లాజిక్ రాజకీయాల్లో చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎవరినైనా బలి చేయాలని అనుకున్నప్పుడు ఆయా నేతలపై పవర్ ఉన్న వాళ్లు అలాగే టార్గెట్ చేస్తారు. ఈటల రాజేందర్ను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపిన అంశంపై అవగాహన ఉన్న వారికి ఆ ఫార్ములా ఏమిటో అర్థమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో రివర్స్లో జరుగుతోంది. తనపై తానే పిచ్చి ముద్ర వేయించుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయన తీరును చూసి జాలిపడాలో..నవ్వాలో..తన గొయ్యి తానే తీసుకుంటున్నాడని అనుకోవాలో ఎవరికీ అర్థం కావడం లేదు. చివరికి వైసీపీ నేతలకు కూడా.
రాజకీయాలకు పనికి రాని నేత జగన్
జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు.. ఆయనకు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొంత కాలంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చెప్పేది జగన్ రెడ్డి ఓ అసాంఘిక వ్యక్తి, రాజకీయ నాయకుడిగా కన్నా దోపిడీ ముఠాలకు నాయకుడిగా, అసాంఘిక శక్తులకు నేతగా ఉంటారని సామాన్య ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తారని.. ఆయనకు ఎలాంటి బాధ్యత లేదని చెబుతూ ఉంటారు. ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పై అదే ముద్రపడింది. రాష్ట్రాన్ని రౌడీమూకలకు వదిలేశారు. పోలీసులతో తప్పుడు పనులు చేయించారు. ఐపీఎస్లతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారు. ఐఏఎస్లలో లిక్కర్ స్కాములు చేయించారు. మొత్తంగా సామాన్యులను పీల్చిపిప్పి చేశారు. ఎంత పిప్పి చేసినా.. ప్రజలు కులద్వేషం రెచ్చగొడితే తనకే ఓట్లు వేస్తారని ఆయన అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. కడుపు కాలక ముందు… కుటుంబాలకు, ఆస్తులకు ముప్పు రాక ముందు కులం ప్రాధాన్యత అవుతుందేమో కానీ అసలు మొత్తానికే ముప్పు వచ్చాక కులం ఏముంది?. జగన్ రెడ్డిని పాతాళానికి పడేశారు. జగన్ మళ్లీ గెలిస్తే తాము రాష్ట్రం వదిలి పోవాల్సిందేనని అరవై శాతం మంది అనుకున్నారు కాబట్టే ఆయనకు అలాంటి ఫలితాలు వచ్చాయి మరి ఇలాంటి ఇమేజ్ ఉన్నప్పుడు జగన్ రెడ్డి ఏం చేయాలి ?.
టీడీపీ కోరుకున్నట్లే ముద్ర వేయించుకుంటున్న జగన్
జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ఎంత భయంకరంగా ఉందో టీడీపీ నేతలు సరిగ్గా అంచనా వేశారు. ప్రజల్లో ఆయనపై ఉన్న భయాన్ని మరింత పెంచాలని అనుకుంటున్నారు. ఆరు నెలల కిందటి నుంచి జగన్ రెడ్డి మళ్లీ వస్తే అనే ఓ రకమైన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని చూసి వైసీపీ, జగన్ రెడ్డి ఆయన సైకో కార్యకర్తలు మళ్లీ వస్తే అంటున్నారని సంబరపడ్డారు. కానీ ఆ ప్రచారం వెనుక ఉన్న అసలు నిజం.. మళ్లీ వస్తే జరిగేది అంత కంటే విధ్వంసం.. మీ మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ ఉండదు అని భయటపెట్టడం. ఈ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోలేని వైసీపీ నేతలు.. క్యాడర్.. మేము వస్తే రప్పా..రప్పా నరికేస్తాం అని పోస్టర్లు ఒంటికేసుకుని తిరుగుతున్నారు. జగన్ రెడ్డి నేను వస్తే సినిమా చూపిస్తానని బెదిరిస్తున్నారు. రప్పా రప్పా నరికితే తప్పేమిటంటున్నారు. బెదిరిస్తే అంతా బెదిరిపోతారని అనుకుంటున్నారేమో కానీ జగన్ రెడ్డి నేరుగా అసాంఘిక శక్తులకు మద్దతుగా నిలవడం ప్రారంభించారు. తెనాలి వెళ్లి గంజాయి బ్యాచ్ కు మద్దతు తెలపాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయనపై టీడీపీ నేతల్లోనూ జాలి కలిగి ఉంటుంది. ఆ తర్వాత పొదిలిలో చాలా చిన్న నిరసనపై వారు చేసిన దాడులు.. సత్తెనపల్లి లో చేసిన హడావుడితో.. పూర్తిగా వైసీపీ అసాంఘిక శక్తి అనే భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది. అన్నింటికీ మించి జగన్ రెడ్డి తన పార్టీకి, తనకు… పదకొండు వందల అడుగుల గొయ్యి తవ్వడానికి గురువారం ఉదయం పెట్టిన ప్రెస్మీట్ సరిపోతుంది. రప్పా..రప్పా నరకుతాం అనేది పుష్ప డైలాగట.. తాను చెప్పడమే కాదు ముఖాలు కనిపించకుండా జర్నలిస్టులతోనూ చెప్పించి.. చేయి గడ్డం కిందకు పెట్టి సమర్థించేశారు. ఆ సమయంలో ఆయనను చూసిన వారికి భయం వేసి ఉండదు..కానీ జాలి వేసి ఉంటుంది. ఎందుకంటే.. పదో తరగతి పిల్లవాడికి కూడా రాజకీయాల గురించి కాస్త అవగాహన ఉంటే జగన్ రెడ్డి ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమైపోతుంది. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు తనపై ఎలాంటి ముద్ర వేయాలనుకుంటున్నారో… అంతకు మించిన ముద్రను తానే వేసుకుంటున్నారు. చెరిపేయలేని విధంగా కర్రు కాల్చి వాతలు పెట్టుకుంటున్నారు.
కసితో స్వయం వినాశకత్వం
జగన్ రెడ్డి పుష్పా డైలాగ్ చెప్పి సమర్థించిన తరవాత ప్రజల్లో వచ్చిన స్పందనను కనీసం ఫీడ్ బ్యాక్ రూపంలో అయినా ఆయన తెప్పించుకుని ఉంటే.. కాస్త అయినా రాజకీయ అవగాహన వచ్చేది. కానీ ఆయన కోటరీ గుప్పిట్లో ఉంటారు. వారు ఏది చెప్పమంటే అదే చెబుతారు. అదే నమ్ముతారు. ఎంతగా ఉంటే.. మనకు ప్రతిపక్ష హోదా వచ్చిందని ఆయన కార్యకర్తల సమావేశంలో సిగ్గులేకుండా చెబుతారు. ఆ హోదా కోసం కోర్టుకెళ్లినా రాలేదని అందరికీ తెలుసు. అయినా ఆయన తనదైన ప్రపంచంలో బతుకుతూ ఉంటారు.. తాను ఏది చెబితే అది నమ్మేస్తారని అనుకుంటారు. ఈ విచిత్రమైన మనస్థత్వం ఆయనకు ఇప్పుడే కాదు..సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉంది. దిశ చట్టం తెచ్చాం.. ఐదుగురికి ఉరేశామని ప్రచారం చేసుకున్నప్పుడే ఆయన మానసిక స్థితిపై చాలా మందికి అనుమానాలొచ్చాయి. అవి ఎప్పటికప్పుడు బలపుడుతూ వచ్చాయి. ఇప్పుడు ఆయన పదవి పోగొట్టుకుని ఎమ్మెల్యేగా మిగిలారు. ఇప్పుడైనా మారుతారా.. అంటే తాను పై నుంచి .. పాతాళంలోకి ఎలా పడిపోయినా సరే.. ఆయనలో ఇసుమంత కూడా మార్పు లేదు కానీ.. మరింత మూుర్ఖంగా మారుతున్నారు. బహుశా ఆయన ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలన్న వ్యూహంలో ఉన్నట్లుగా ఉన్నారు. అసాంఘిక శక్తుల్ని.. రౌడీల్ని పెంచి పోషించి వారితోనే వచ్చే ఎలక్షన్ చేద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే తనకు ఇక సామాన్య ప్రజలు ఓట్లు వేయరని ఆయనకు క్లారిటీ వచ్చింది. ఆయన ఐదు సంవత్సవరాల పాటు చూపించిన పులకేశి పాలనను ప్రజలు మరో ఇరవై ఏళ్ల పాటు గుర్తు చేసుకుని ఉలిక్కి పడటం ఖాయం. అందుకే మళ్లీ ఆయన వస్తే అనే భయం కలిగితే.. మరోసారి ఓటు వేయరు. అందుకే.. అలాంటి వారందర్నీ ఓట్లు వేయడానికి రానివ్వకుండా.. చేసి తన పార్టీకి చెందిన వారితోనే ఓట్లు వేయించుకోవాలన్న ప్లాన్ అమలు చేయాలని ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నట్లుగా ఉంది. ఇలా అనుకుంటూ ఉంటే.. జగన్ రెడ్డి ఇంకా 1980ల్లోనే ఆగిపోయాడని అనుకోవాలి. ఇది 2025. మన దేశం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఎంతో మంది రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పదవుల్ని శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. కానీ ఒక్కరంటే.. ఒక్కరూ విజయం సాధించలేదు. అందర్నీ ప్రజాస్వామ్యం శంకరగిరి మాన్యాలు పట్టించింది.
ప్రజల్ని పట్టించుకోని రాజకీయాలు చేస్తే రాజకీయ సమాధే !
రాజకీయాల్లో అత్యధిక కాలం ఉన్న నేతల రాజకీయ జీవితాలను స్టడీ చేస్తే అసలు సక్సెస్ సీక్రెట్ తెలుస్తుంది. నరేంద్రమోదీ అయినా, చంద్రబాబు అయినా .. నవీన్ పట్నాయక్ అయినా ఎవరైనా రాజకీయాలను ప్రజాకోణంలోనే చూశారు. వ్యక్తిగతంగా ఎప్పుడూ చూడలేదు. తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల కోణంలో ఆలోచించి.. వారి పట్ల భయభక్తులతో తీసుకుంటారు. కొన్ని సార్లు అలా తీసుకున్నా వారికి ప్రతికూల ఫలితాలు ఎదురయి ఉండవచ్చు.. కానీ వారి పట్ల ప్రజలు మరోసారి నమ్మకాన్ని వెంటనే పెంచుకుంటారు. దానికి నిదర్శనం చంద్రబాబే. 2019లో పరాజయం తర్వాత ఇక చంద్రబాబు పుంజుకోగలడా అనుకున్నారు. కానీ ఐదేళ్లు తిరిగే సరికి ఆయన దేశ రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వానికి బలమైన పిల్లర్ గా మారిన బాహుబలిగా మారారు. ఒక్క చంద్రబాబు అనే కాదు.. దేశంలో ఉన్న దిగ్గజ రాజకీయ నాయకులు, సుదీర్ఘంగా ప్రజా జీవితంలో ఉన్న వారి స్టయిల్ను పరిశీలిస్తే అది స్పష్టమవుతుంది. అలా కాకుండా.. ప్రజలు వేరే వాళ్లపై వ్యతిరేకతతో తనకు ఓట్లు వేస్తారని తాను మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తానని ప్రజలతో సంబంధం లేదని అనుకుంటే.. అలాంటి వారు ఇలా పుట్టి అలా కనుమరుగు అవుతారు. జగన్మోహన్ రెడ్డి మారుతానని చెప్పారు. ఏం మారుతారో మాత్రం చెప్పలేదు. కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. తన కోసం..తన బలప్రదర్శన కోసం వచ్చిన ఇద్దరు ప్రాణాలు కోల్పోతే కనీసం ఓ సంతాపం వ్యక్తం చేయలేదు. పరామర్శించలేదు. ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పలేదు. సత్తనపల్లి పర్యటనకు వెళ్లిన సమయంలో చనిపోయింది ఓ ముఫ్పై ఏళ్ల యువకుడు . జగన్ కారు ముందు ఉన్న కారుకు నిలబడి నినాదాలు చేసుకుంటూ వస్తున్నాడు. అక్కడిక్కకడ పడిపోతే ఆటోలో అనాథలా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎలా ఉన్నాడు.. చనిపోయాడా.. బతికాడా.. వైద్యం ఎలా అందుతోంది అన్నది పట్టించుకున్న వారు లేరు. అదేనా కార్యకర్తల్ని పట్టించుకోవడం అంటే ?.
ఎంత కోల్పోయారో ఇప్పటికీ తెలుసుకోకపోతే ఎలా?
రాజకీయాలు చేయాలంటే ఖచ్చితంగా కొన్ని లక్షణాలు ఉండాలి. ఎంత కన్నింగ్ తెలివితేటలు ప్రదర్శించినా ప్రజల్ని మోసం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతారు. ప్రజల్ని భయపెట్టాలనుకుంటే శంకరగిరిమాన్యాలు పట్టిపోతారు. దానికి సూచనలు ఇప్పటికే వచ్చాయి. ఏపీలోని అధికార పార్టీ ఆయనకు ఆ గతి పట్టించకడానికి చాలా ప్లాన్డ్ గా వ్యవహరిస్తోంది. జగన్ రెడ్డి మనస్థత్వాన్ని, ఆయన సలహాదారుల వ్యక్తిత్వాన్ని గట్టిగా అంచనా వేసి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ రెడ్డి వారు అనుకున్నట్లుగా తన పయనం సాగిస్తున్నారు. ఆయనపై ఎలాంటి ముద్ర వేయాలని అనుకుంటున్నాయో.. అలాంటి ముద్ర వేస్తున్నాయి. ఇలా చాలా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇక సమయం చూసి జగన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని పాతి పెట్టడమే మిగిలిందనుకునే పరిస్థితికి తెస్తారు. మహా అయితే మరో ఏడాదిలోనే ఇది జరిగిపోవచ్చు. అప్పటికి జగన్ రెడ్డికి లైట్ వెలుగుతుందో లేదో కానీ..ఆ తర్వాత చేయగలిగిందేమీ ఉండదు. ఎందుకంటే అప్పటికే ఆయన రాజకీయ జీవితం ఫనిష్ అయిపోయి ఉంటుంది. అది సాధ్యం కాదు అని ఆయన అనుకుంటూ ఉంటే..అంతకు మించి అమాయకత్వం ఏమీ ఉండకపోవచ్చు. రాజకీయాల్లో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. కానీ ఏదీ కూడా.. దానంతటకు అది రాదు. అంతా ప్రణాళిక ప్రకారం.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తేనే వస్తుంది. ఆ ఆటలో వెనుకడితే.. నిర్దాక్షిణ్యంగా రాజకీయ జీవితాన్ని అంతం చేస్తారు. మొదట చెప్పుకున్న సామెత కన్నా ఎక్కువగా.. తనపై తానే ముద్ర వేసుకుంటున్నారు జగన్ రెడ్డి. ఇలా చేసుకోవడమే రాష్ట్రానికి మంచిది. ప్రజలకు మంచిది. అందుకే గో ఎహెడ్ జగన్ రెడ్డి!