ఎడిటర్స్ కామెంట్ : న్యాయమేనా ?

మన దేశంలో న్యాయం పొందడానికి లేదా న్యాయం కోసం ప్రయత్నించడానికి కూడా కులం, మతం, ఆస్తి, అంతస్తు ఉండాలి. కానీ రాజ్యాంగంలో అలా లేదు. న్యాయం అందరికీ ఒకటేనని.. చట్టం ఎవరికీ ఎక్కువ,తక్కువ కాదని చెబుతుంది. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది ?. ఇక్కడ ఏపీలో జరిగిన రెండు ఘటనల్ని గుర్తు చేసుకుందాం.. ఒకటి దళిత యువకుడ్ని చంపిన ఎమ్మెల్సీ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. నిర్భయంగా ఆయన పోలీసుల్నే డిక్టేట్ చేస్తున్నారు. విపక్ష నేతల్ని అంతు చూస్తా అని బెదిరిస్తున్నారు. కానీ జగన్‌పై కోడికత్తి తో గాయం కాకుండా దాడి చేసిన జనపల్లి శ్రీనివాస్ అనే దళితుడు మాత్రం ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నారు. హత్య చేసిన వారు బయటకు వచ్చే అటెంప్ట్ మర్డర్ కింద వచ్చే కేసులో నిందితుడు ఐదేళ్లుగా ఎందుకు జైల్లో మగ్గిపోతున్నాడు ?. అతడు దళితుడనా ?పేదవాడనా ? పలుకుబడిలేదనా ? లేకపోతే ఆయన బయటకు వస్తే కొంత మంది రాజకీయ జీవితాలకు ఇబ్బంది అవుతుందనా ?. న్యాయవ్యవస్థ కూడా ఇలాంటి బాధితుల పట్ల ఎందుకు కనీసం కన్సర్న్ చూపించలేకపోతోంది.

హత్య చేసిన అనంతబాబు బయట – కోడికత్తి శీను ఐదేళ్లుగా జైల్లో !

విశాఖ విమానంలో జగన్ రెడ్డిపై జనపల్లి శ్రీనువసరావు కోడికత్తితో దాడి చేశారు. నిజంగా దాడి చేశారో లేదో తెలియదు. ఎందుకంటే ఎయిర్ పోర్టులో ప్రతీ మూలా కవర్ చేసే సీసీ కెమెరాలు లేని చోట ఈ దాడి జరిగింది. అప్పట్లో చిన్న గాయంగా చెప్పుకొని జగన్ హైదరాబాద్ వెళ్ళిపోయారు. అయితే ఆ ఘటన వెనుక కుట్ర కోణం ఉందని.. జగన్ ను అంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీయే హత్యాప్రయత్నం చేసిందని వైసిపి ఆరోపించింది. అటు నిందితుడు సైతం జగన్ కు సానుభూతి దక్కేందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపాడు. అందుకు తగ్గట్టుగానే జగన్కు ఎనలేని సానుభూతి దక్కింది. అధికారంలోకి రాగలిగారు. తొలుత చిన్న దాడిగా చెప్పుకున్న జగన్.. దానిని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. ఎలాగోలా అధికారంలోకి వచ్చారు. కానీ ఐదేళ్లుగా నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకి మాత్రం జైలు నుంచి విముక్తి లభించడం లేదు. ఇప్పటికీ ఆయన రిమాండ్ ఖైదీ గానే ఉన్నాడు. ఎన్ఐఏ విచారణ పూర్తి చేసి ఇందులో ఏ కుట్ర కోణము లేదని న్యాయస్థానానికి చెప్పింది. కానీ జగన్ మాత్రం లోతైన విచారణ జరపాలని కోరుతున్నారు. లోతుగా దర్యాప్తు చేశామని కుట్ర లేదని ఎన్ఐఏ చెబుతోంది. ఈ ఐదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా విచారణకు రాలేదు. అటు నిందితుడికి బెయిల్ దక్కకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్న అపవాదు సైతం ఉంది. నిందితుడు శ్రీనివాసరావు దళిత యువకుడు. వైసిపి వీరాభిమాని. జగన్ కు సానుభూతి దక్కాలనే తాను కోడి కత్తితో దాడి చేసినట్లు చెబుతున్నాడు. ఈ కేసు విచారణ విజయవాడ కోర్టు నుంచి విశాఖకు మారింది. ఈ దాడి వెనుక వైసిపి పక్క వ్యూహం ఉందని నిందితుడు తరపు న్యాయవాది చెబుతున్నారు. మంత్రి బొత్స మేనల్లుడు మధ్య శ్రీనివాసరావు ఈ కోడి కత్తిని సమకూర్చారని బాహటంగానే ఆయన వ్యాఖ్యానించారు. అటు నిందితుడు తల్లి, సోదరుడు సీఎం జగన్ ను కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించారు కానీ.. పోలీసులు అడ్డుకున్నారు. అటు న్యాయస్థానాల్లో నిరుపేద కుటుంబం పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. రిమాండ్ ఖైదీగానే ఐదేళ్లపాటు నిందితుడు ఉండిపోయాడు. తాను బాధితుడ్నని గగ్గోలు పెడుతున్న జగన్ రెడ్డి కనీసం కోర్టుకు వచ్చి తన వాదన వినిపించడం లేదు సరి కదా కోర్టులో జరుగుతున్న ట్రయల్‌ను విచిత్రమైన పిటిషన్లతో నిలిపివేయించారు. ఇందులో కుట్ర కోణం ఉందని చెబుతున్న బాధితుడు, ఏపీ సీఎం జగన్ ఈ ఐదేళ్లలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కోర్టు విచారణకు హాజరు కాలేదు. ముఖ్యమంత్రిగా క్షణం తీరిక లేకుండా ఉండడం వల్లే విచారణకు హాజరు కాలేకపోతున్నానని కోర్టుకు చెబుతున్నారు. నిందితుడు జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శిక్ష పడినా ఐదేళ్లు ఉండదే !

కోడికత్తి శీను తల్లిదండ్రులకు వేదన తప్పడం లేదు. ఐదేళ్లు అయినా ఆయనకు బెయిల్ లభించలేదు. మామూలుగా ఎలాంటి కేసులో అయినా 180 రోజుల తర్వాత బెయిల్ లభించాల్సి ఉంటుంది. కానీ తనపై జరిగిన దాడిని కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని అప్పట్లో బీజేపీ సర్కార్ లో మంచి పట్టు ఉన్న జగన్ రెడ్డి లాబీయింగ్ చేసి.. ఎన్ఐఏ దర్యాప్తు వేయించుకున్నారు. సీబీఐ విచారణ చేయాలంటే కోర్టు ఆదేశాలుండాలి. కానీ ముందుగానే ఎన్ఐఏ విచారణకు ఆదేశాలు తెచ్చుకోవడంతో కోర్టు కూడా అంగీకరించింది. ఎన్ఐఏ కేసులు చాలా తీవ్రమైనవి. బెయిళ్లు అంత తేలికగా రావు. ఓ సారి బెయిల్ ఇస్తే.. ఎన్ఐఏ రద్దు చేయించింది. అప్పట్నుంచి జైల్లోనే ఉన్నారు. ఐదేళ్ల జీవితం మగ్గిపోయింది. ఎన్ఐఏ దర్యాప్తు తాము అనుకున్నట్లుగా రాలేదని జగన్ రెడ్డి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి విచారణ ఆలస్యం చేస్తున్నారు. దీంతో జైలులోనే మగ్గిపోతున్నాడు కోడికత్తి శీను. బెయిల్ ఇచ్చేందుకు తమ అధికారం లేదని ఎన్ఐఏ కోర్టు కూడా స్పష్టం చేసింది. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. కానీ తన మాజీ డ్రైవర్‌ను హత్య చేసిన అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన బుధవారం విడుదలయ్యారు. చార్జిషీట్ దాఖలు చేయకపోవడం వల్లనే బెయిల్ కు అర్హుడని న్యాయస్థానం బెయిల్ ఇస్తూ చెప్పింది. ఈ చార్జిషీటు ఎందుకు దాఖలు చేయలేకపోయారు.. అంత క్లిష్టంగా కేసు ఉందా అనే అంశాల జోలికి వెళ్లలేదు. అధికార పార్టీ ఎమ్మెల్సీ అయిన అనంతబాబు హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. అంతే.. పోలీసులు కూడా దర్యాప్తు చేయలేదు. ఎలాంటి పరిశోధన చేయలేదు. పైగా కోర్టుకు ఆయన పెద్ద బుద్దిమంతుడని రిపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ లెక్కలోకి రాలేదు. చివరికి విడుదలయ్యారు. కోడికత్తి కేసు తేలకపోతేనే తనకు రాజకీయంగా మేలని జగన్ అనుకుంటున్నారు. ఆ కేసు తేలకపోతే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు బెయిల్ కూడా ఇవ్వొద్దన్నట్లుగా ఉన్నారు. ఎన్ ఐఏ కేసులో బెయిల్ రావడం అసాధ్యం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేసును..బ దిలీ చేయాలని కోరాలని లేకపోతే.. నిందితుడిగా బెయిల్ ఇవ్వాలని సిఫారసు చేయాలని కోడికత్తి శీను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కానీ ఏ మాత్రం ప్రయోజనం లేకపోయింది. కోడికత్తి శీను చిన్న గాయం చేసినా.. ఇంకా జైల్లోనే ఉన్నారు. అదే హత్య చేసినా.. అనంతబాబు దర్జాగా బయటకు వచ్చారు. ఇక్కడ అసలు విషయం.. కోడికత్తి శీనుకు బెయిల్ రాకపోవడానికి ప్రభుత్వ సహకారం లేకపోవడం కారణం అయితే.. అనంతబాబుకు బెయిల్ రావడానికి పూర్తి సహకారం అందించడమే కారణం. ఈ తేడా ప్రభుత్వం ఎందుకు చూపించింది.. జనుపల్లి శ్రీనివాసరావు దళితుడనేనా ?

మానవత్వం లేని నాయకత్వం

నాయకుడు అనేవాడికి కాస్తంత మానవత్వం ఉండాలి. గత ఎన్నికల్లో దాడి చేసి జైలుకెళ్లాడు.. వచ్చే ఎన్నికల వరకూ జైల్లోనే ఉంచి..దాన్ని కూడా రాజకీయం చేద్దాం అనుకుంటే అంత కంటే ఘోరమైన మనస్థత్వం ఉండదు. జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి జగన్ రెడ్డికి ఎంత వీరాభిమానో చెప్పాల్సిన పనిలేదు. రేపు ఎవరెవరో కష్టపడి.. రాష్ట్రపతి దాకా వెళ్లి పోరాటం చేసి బెయిల్ ఇప్పిస్తే… ఆ శీను జగన్ రెడ్డికే జైకొట్టినా ఆశ్చర్యం లేదు. ఆ విషయం తెలిసినా ఎంతో మంది ఇతర పార్టీల సానుభూతిపరులు..ఓ యువకుడి భవిష్యత్ నాశనం కాకూడదని అతని తరపున పోరాడేందుకు ప్రయత్నిస్తున్నారు. హై ప్రోఫైల్ కేసులో దళితుడి పరిస్థితి ఇలా ఉంటే.. ఇక మిగతా కేసుల్ల ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రికార్డులే చెబుతున్నాయి.

కోడికత్తి శీనుదే కాదు కనీస సాయం లేక జైళ్లలో మగ్గిపోతున్న దళితులు

గత ఏడాది ఏప్రిల్‌లో కోర్టు తీర్పు ప్రకారం జరిమానా చెల్లించలేని పేదలకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర హోం శాఖ విధివిధానాల రూపకల్పన చేసింది. తమ జైళ్లలో ఇలా మగ్గుతున్నవారి వివరాలు సేకరించాలని రాష్ట్రాలకు తెలియజేసింది. వారి కోసం కేంద్రం ద్వారా లభించే నిధులకు ఆయా కోర్టు ఆధీనంలో పనిచేసే జిల్లా న్యాయ సేవల సంస్థ ద్వారా అందించాలని సూచించింది. చిన్న మొత్తాలను సైతం బెయిల్ కోసం పూచికత్తు ఇవ్వలేని వారికి కూడా ఆర్థికంగా సాయపడి వారిని విడుదల చేసేలా చూడాలని కూడా ఈ ప్రత్యేక పథకంలో ఉంది. ఈ లెక్కన ఖైదీల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా విచారణ ఖైదీకి రూ. 40 వేలు, శిక్ష పడిన వారికి రూ. 25 వేలు మంజూరు చేస్తారు. దీని వల్ల వేల సంఖ్య లో ఉన్న ఇలాంటి వారితో కిక్కిరిసిపోయిన జైళ్ల పరిస్థితికి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. ఏపీలో కేవలం ఛార్జిషీటు వేయకుండా ఉన్న రిమాండ్ ఖైదీలు 2018లో 270 మంది ఉంటే 2022లో జగన్ ముఖ్యమంత్రిత్వంలో దళితుల 1470 మంది ఉన్నారు. జైళ్లల్లోని ఖైదీల హాజరుపట్టికను పరిశీలిస్తే అగ్ర కులాల సంఖ్య తగ్గింది, దళితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రభుత్వానికి, పోలీసులకు, జగన్ కు పట్టనప్పుడు వారికి దిక్కెవరు? జరిమానా చెల్లించలేక, తగిన ఆర్థిక స్తోమత లేక జైళ్లలో మగ్గుతున్నవారు మన దేశంలో వేలల్లో ఉన్నారు. జరిమానా చెల్లించలేక తమ శిక్షాకాలం కన్నా రెట్టింపు సమయాన్ని జైలులో గడుపుతున్నవారు కూడా ఉన్నారు. రూ. 2 లక్షలు జరిమానా చెల్లించలేని వ్యక్తి శిక్షాకాలం పూర్తి అయినా అతన్ని గత ఆరేళ్లుగా జైల్లోనే ఉంచుకోవడాన్ని ఈ మధ్య మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. ఆయన కుటుంబానికి ఆస్తులుండి కూడా ఉద్దేశపూర్వకంగా చెల్లించకపోతే చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు. కానీ నిజంగానే అంతటి ఆర్థిక స్తోమత లేనివారిని జైల్లో నిర్బంధించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు క్రూర ఉల్లంఘన కిందికే వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. అంటే కోడికత్తి శీను తరహాలో ఎంతో మంది బాధితులు జైళ్లలో మగ్గిపోతున్నారన్నమాట.

దేశంలో పడిపోతున్న వ్యవస్థల ప్రమాణాలు

జగన్ పై దాడి కేసులో విచారణ పూర్తయితే నిందితుడైన జనపల్లి శ్రీనివాసరావుకు ఎంత శిక్ష పడుతుంది. మహా ఆయితే రెండేళ్లలోపు శిక్ష పడుతుంది. మరి ఇప్పటి వరకూ కోడికత్తి శీను ఐదేళ్లకుపైగా జైల్లో ఉన్నారు. శిక్ష కాలం కంటే ఎక్కువే ఉన్నారు. రేపు తక్కువ శిక్ష పడితే ఆ శిక్షా కాలాన్ని .. జీవితాన్ని జనపల్లి శ్రీనివాసరావుకు ఎవరు తెచ్చిస్తారు ?. ఎవరూ తెచ్చివవలేరు. ఎందుకంటే కరిగిపోయిన కాలాన్ని తెచ్చిచ్చే మొనగాడెవరూ లేరు. అందుకే.. న్యాయం ఖరీదుగా మారితే అధికారం, ధనం ఉన్న వారి చేతిలో కీలుబొమ్మగా మారి సత్యాన్ని సమాధి చేస్తుంది. చట్టం ముందు అందరూ సమానమనే సామెత పాతది. ఇప్పుడు చట్టం ముందు కొందరే సమానం. బడిత ఉన్నవాడిదే బర్రె. అధికారం, డబ్బు ఉన్నవాడిదే సర్వస్వం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భావించే భారతదేశంలో న్యాయం విషవలయంలో చిక్కుకుంది. ప్రజాస్వామ్య దేశాల సూచిలో భారత్ 2014లో 27వ స్థానం, 2016లో 32వ స్థానంలో ఉండగా.. ఇప్పుడది 55వ స్థానానికి పడిపోయింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం సగానికి పైగా పడిపోవడం అత్యంత తీవ్రమైన పరిణామం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నియంతృత్వ విధానాలే కారణం. అన్ని వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం తమ చెప్పు చేతల్లోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని గేలి చేస్తోంది. ఇప్పుడు అదే కనిపిస్తోంది.

వ్యవస్థలే ఆలోచించాలి.. రాజకీయ కుట్రల్నిచేధించాలి.. బలహీనలకు న్యాయం అందించాలి..లేకపోతే వారికెవరు దిక్కు ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close