డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం నెలల తరబడి శ్రమించి, ట్విట్టర్ మొత్తాన్ని వాడేసిన ఎలాన్ మస్క్ కు చాలా త్వరగానే జ్ఞానోదయం అయింది. ఐదు నెలలు పూర్తి కాకుండానే… డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ లో తన పని ముగిసినట్లుగా ప్రకటించేసుకున్నారు. తన నిర్ణయాన్ని ఎక్స్ లో ప్రకటించారు. అవకాశం ఇచ్చినందుకు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపాడు. ట్రంప్తో సంప్రదింపులు లేకుండా సీనియర్ సిబ్బందికి చెప్పి మస్క్ నిర్ణయం ద్వారా జరిగిందని వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి.
ట్రంప్ నిర్ణయాలు మస్క్కు నచ్చడం లేదు. ఇటీవల ట్యాక్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ బిల్ ను ట్రంప్ తీసుకు వచ్చారు. ఇది మస్క్ కు నచ్చలేదు. ఇది ఖర్చులు పెంచే బిల్లు అని బహిరంగంగానే విమర్శించాడు. ట్రంప్ బిల్లును “బిగ్ లేదా బ్యూటిఫుల్”గా చెబుతున్నారని కానీ అది ఈ రెండూ కాదని స్పష్టం చేశాడు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మస్క్ వ్యాపారాలూ దెబ్బతిన్నాయి. ఈ కారణంగా ఆయన వైదొలుగుతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ట్రంప్ నిర్ణయాలను విమర్శిస్తూ వైదొలగడంతో మాత్రం విమర్శకుల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది.
DOGE వేలాది ఫెడరల్ ఉద్యోగులను తొలగించింది. USAID వంటి ఏజెన్సీలను మూసివేసింది. కానీ ట్రిలియన్ డాలర్ల ఖర్చులను మిగిల్చాలన్న లక్ష్యానికి దూరంగా ఉంది. DOGE సేవలను మెరుగుపరచలేదని పైగా ప్రభుత్వ సామర్థ్యాన్ని దెబ్బతీసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన భారీగా సంపదను కోల్పోయారు. ఇప్పుడు వ్యాపారాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. ట్రంప్ నిర్ణయాలకు మద్దతివ్వడం వల్ల ఆయనపై చాలా మంది వ్యతిరేకత పెంచుకున్నారు. ఇప్పుడు ట్రంప్ దెబ్బకు కుదలైన తన వ్యాపారాలను బాగు చేసుకోవడమే ఆయన కర్తవ్యం.