వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. గతంలో నియోజకవర్గాలపై పట్టు సాధించిన నేతలు పదవులు పోయాక క్యాడర్ ను పట్టించుకోవడమే మానేశారు. వైసీపీ నేతలు కొంతమంది దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తిలో ఎంపీ గురుమూర్తి వైసీపీ క్యాడర్ కు అన్ని తానై వ్యవహరించడం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది.
మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఓటమి పాలయ్యాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ కు అత్యంత సన్నిహిత నేత అయిన మధుసూదన్ కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటారని అనుకుంటే ఆయన మాత్రం స్థానికంగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో క్యాడర్ అంతా గురుమూర్తి వైపు పరుగులు పెట్టడం ఆసక్తికరంగా మారింది.
నియోజకవర్గంలో వైసీపీకి గురుమూర్తి మూలస్తంభంగా మారుతున్నారని, బియ్యపు మధుసూదన్ శ్రీకాళహస్తికి దూరంగా ఉంటున్నారా? లేక, తన ప్రమేయం లేకుండా క్యాడర్ ను గురుమూర్తి వైపు తిప్పుకోవడం నచ్చక నియోజకవర్గానికి సెలవు ప్రకటించారా? రాజకీయాలపై ఆసక్తి తగ్గిందా ? అని వైసీపీలో జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే, ప్రస్తుతం పాలిటిక్స్ పై మధుసూదన్ అనాసక్తిగా ఉన్నారని వైసీపీలోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో గురుమూర్తిని బరిలో నిలిపే ఆలోచనతో వైసీపీ అధిష్టానం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే శ్రీకాళహస్తిలో గురుమూర్తి జోక్యం పట్ల జగన్ సైలెంట్ గా ఉన్నారని టాక్ నడుస్తోంది.