ఈమధ్య టాలీవుడ్ కి ఏదో అయ్యింది. వరుసగా అన్నీ కాంబినేషన్ల కబుర్లే. ఆ హీరో, ఈ దర్శకుడు కలుస్తున్నారని, పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్టీఆర్, చరణ్, బన్నీ… ఇలా అగ్ర హీరోలందరూ వార్తల్లో ఉంటున్నారు. త్రివిక్రమ్ దగ్గర్నుంచి నెల్సన్ వరకూ ప్రముఖ దర్శకులందరి పేర్లూ వినిపిస్తున్నాయి. ఈ కాంబోలన్నీ ఓకే అయి, సినిమాలు పూర్తయ్యేటప్పటికి ఒక్కో హీరో కెరీర్లో మరో పదేళ్లయినా గడిచిపోతాయి. అలా ఉంది లైనప్.
కాకపోతే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లా కొట్టి పరేస్తున్నాయి ఇన్ సైడ్ వర్గాలు. ”చేతిలో ఉన్న సినిమాలే పూర్తి కాలేదు, అవి ఎప్పుడు బయటకు వస్తాయో చెప్పలేని పరిస్థితి. ఈలోగా కొత్త సినిమాలు, కొత్త దర్శకులు ఎక్కడ్నుంచి వచ్చారు?” అనేది వాళ్ల మాట. అదీ కరెక్టే అనిపిస్తోంది.వ ఇప్పుడు వినిపిస్తున్న కాంబోల్లో కనీసం 20 శాతం పట్టాలెక్కినా గొప్పే. మరి ఎందుకోసం ఈ పబ్లిసిటీ? ఎవరి కోసం? అటు ఫ్యాన్స్, ఇటు సినిమా వర్గాలు, సామాన్య ప్రేక్షకులు కూడా ఈ కాంబో వార్తలతో గందరగోళానికి గురవుతున్నారు.
మా చేతిలో ఈ హీరో, ఈ దర్శకుడు ఉన్నారు అని నిర్మాణ సంస్థలు గొప్పగా చెప్పుకోవడానికి మినహాయిస్తే – ఇలాంటి వార్తల వల్ల ఉపయోగమే లేదు. ఓ అగ్ర హీరోతో ఓ స్టార్ డైరెక్టర్ సినిమా చేస్తున్నాడన్న వార్త దాదాపు 6 నెలల నుంచి వినిపిస్తోంది. కానీ ఇప్పటి వరకూ ఆ హీరోకి, దర్శకుడు కథే చెప్పలేదు. ఈలోగా ఆ దర్శకుడు మరో ఇద్దరు హీరోలతో సినిమాలు చేయబోతున్నాడన్న వార్త బయటకు వచ్చింది. చేతిలో ఉన్న సినిమాకే కథ రెడీ అవ్వలేదు. మిగిలిన ఇద్దరు హీరోలకూ స్క్రిప్టు వండి పెడతారా?
ఎన్టీఆర్ లైనప్ చూస్తే మతిపోతోంది. ప్రశాంత్ నీల్ తరవాత నెల్సన్, ఆ తరవాత త్రివిక్రమ్.. మధ్యలో కొరటాల శివ. ఓ దశలో దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా చేస్తున్నాడని అన్నారు. ఇలా చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ ఒక్కో సినిమా పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుంది? ఎన్టీఆర్ సినిమా అంటే కనీసం యేడాదైనా కాచుకొని కూర్చోవాల్సిందే. అలాంటప్పుడు త్రివిక్రమ్ వంతు వచ్చే సరికి ఎంత టైమ్ పడుతుంది? చరణ్, బన్నీ పరిస్థితి కూడా అంతే. చేతిలో ఉన్న సినిమాలు ఓ కొలిక్కి వచ్చే వరకూ ఏం చెప్పలేని పరిస్థితి. హీరోలు ఖాళీగా లేరు. వాళ్లు తమ తమ కమిట్మెంట్స్ పూర్తి చేసుకొనే లోపు ఏమైనా జరగొచ్చు. అది అర్థం చేసుకోకుండా కాంబోల వార్తలు గుప్పిస్తే – దాన్నుంచి ఒరిగేదేం ఉండదు. అనవసమైన గందరగోళం తప్ప.