అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో సరఫరా చేసినది అసలు నెయ్యే కాదు. కనీసం కల్తీ చేసిన నెయ్యి కూడా కాదు. రసాయనాలతో నెయ్యిలా కనిపించే మిశ్రమాన్ని తయారు చేసే బోలేబాబా డెయిరీ వాటిని వైష్ణవి, ఏఆర్ డెయిరీల పేరుతో టీటీడీకి సరఫరా చేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ కోర్టుకు తెలిపింది. నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టి వేయాలని చెబుతూ దాఖలు చేసిన అఫిఢివిట్ లో ఈ సంచలన విషయాలు ఉన్నాయి.
ఈ నెయ్యి మాఫియా .. సాక్షుల్ని బెదిరిస్తోంది. వారు వేసినట్లుగా తప్పుడు పిటిషన్లు వేస్తోంది. ఎవరూ సీబీఐ సిట్ ముందు హాజరు కాకుండా.. కాపలా కాస్తున్నారు. ఓ సాక్షి తిరుపతి ఎయిర్ పోర్టులో దిగితే అతన్ని కిడ్నాప్ చేసి.. చెన్నై తీసుకెళ్లి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించారట. మరో వ్యక్తి పేరుతో తప్పుడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ వ్యక్తి తాను పిటిషన్ దాఖలు చేయలేదని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని చంద్రబాబు ఆరోపించినప్పుడు వైసీపీ నేతలు భగ్గుమన్నారు. దేవుడిని కించ పరుస్తున్నారని ఆరోపించారు. అదే వారి ధైర్యం. ఎంత తప్పు చేసినా బయటకు చెప్పరని అనుకున్నారు. కానీ అసలు చేసిన ఘోరం గురించి ప్రజలకు తెలియాలని చంద్రబాబు చెప్పారు. వారు సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. సుప్రీంకోర్టు సిట్ ను నియమించింది. ఆలస్యంగా జరుగుతున్నా అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అసలు ఆ నెయ్యిని టీటీడీ ఎందుకు తీసుకుంది అన్న దగ్గర నుంచి పూర్తి వివరాలను సీబీఐ సిట్ బయట పెట్టనుంది. వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఎను ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో పాటు టీటీడీలో జరిగిన అనే దందాలు బయటకు రానున్నాయి. నెయ్యి మాఫియా స్థానిక ముఠానేనని తాజాగా. వెల్లడవుతోంది. అందరి జాతకాలు బయట పడబోతున్నట్లుగా స్పష్టమవుతోంది.