భారత్ ను దెబ్బతీసేందుకు పాక్ ఐఎస్ఐ పెద్ద స్కెచ్ వేసింది. భారీ సంఖ్యలో భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను గూఢచారులుగా మార్చే పని చేపట్టింది. ఇందుకోసం పాక్ కు చెందిన ఓ రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి భార్య అయిన నోషాబా షెహజాద్ ను పాక్ ఐఎస్ఐ ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
ఇండియాలోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పాక్ కు రప్పించి వారికి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేసేది నోషాబా షెహజాద్. అక్కడే వారిని ఏమార్చి పాక్ కు సహాయం చేసేలా వారిని ట్రైన్ చేసేది. అయితే, అత్యంత సీక్రెట్ గా ఈ వ్యవహారం కొనసాగుతూ ఉండటంతో ఆమె పేరు బయటకు రాకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించారు. ఇందుకోసం ఐఎస్ఐ వర్గాల్లో ‘మేడం ఎన్ ‘అనే కోడ్ నేమ్ తో ఆమెను పిలిచేవారు.
ఇక, భారత్ లో సుమారు 500మందితో కూడిన స్లీపర్ సెల్ ను ఏర్పాటు చేయాలని పాక్ ఐఎస్ఐ ఆమెకు టాస్క్ ఇవ్వగా.. ఇందుకు నోషాబా షెహజాద్ వారి లక్ష్యాన్ని చేరుకునేలా పని చేస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఎలా ప్రభావితం చేయాలనేది పాక్ ఐఎస్ఐ నుంచి వ్యూహాలు అందుతాయని, దాంతో ఆమె తన పనిని పక్కాగా నిర్వర్తిస్తుందని సమాచారం.
మరోవైపు, గత ఆరు నెలల్లో దాదాపు 3,000 మంది భారతీయ పౌరులు, 1,500 మంది ప్రవాస భారతీయులు పాకిస్థాన్ను సందర్శించేందుకు ఆమె సహాయం చేసిందని వర్గాలు వెల్లడించాయి.జ్యోతి మల్హోత్రా పాక్ సందర్శనకు ఈమె సహాయం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై భారత నిఘా వర్గాలు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.