అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన క్షణాల్లోనే అహ్మదాబాద్లోనే కుప్పకూలిపోయింది. విమాన సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఫ్లైట్ లో ఉన్నారు. వీరిలో గుజరాత్ మాజీ సీఎం విజ్య రూపాని కూడా ఉన్నారు. లండన్ లో ఉన్న తన కుమార్తెను చూసేందుకు ఆయన వెళ్తున్నారు. ఆయనను రక్షించినట్లుగా లేదా ఆయన మృతదేహాన్ని కనిపెట్టినట్లుగా ఇంత వరకూ సమాచారం రాలేదు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఒక్కర్ని కాపాడినట్లుగా అధికార వర్గాలు చెప్పడం లేదు. మృతదేహాలను మాత్రం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. రన్ వే నుంచి పైకి లేచిన క్షణాల్లోనే.. పైలట్.. మే డే అనే సందేశాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు పంపించారు. అంటే పూర్తి స్థాయి ప్రమాదంలో ఉన్నామని సంకేతం.అయితే ఆ తర్వాత నుంచి సంకేతాలు ఆగిపోయాయి. ఆ సందేశం ఇచ్చిన సెకన్లలోనే ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఎలా ప్రమాదం జరిగిందన్నది ఇంకా బయటకు రాలేదు. విమాన ప్రయాణికుల్లో బ్రిటన్ వాసులతో పాటు ఇతర దేశస్తులు కొంత మంది ఉన్నా రు.
విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. అది లంచ్ సమయం కావడంతో.. ఆ హాస్టల్ లో మెడికోలు చాలా మంది క్యాంటిన్ లో ఉన్నారు. విమానం హాస్టల్ భవనంపై కూలడంతో కనీసం ఇరవై మంది మెడికోలు చనిపోయినట్లుగా భావిస్తున్నారు. మృతుల సంఖ్యపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, విమానాయాన మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ పార్టీకి చెందిన మాజీ సీఎం కూడా ఉండటం వారిని షాక్ గురి చేసింది. అమిత్ షా హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరారు.
దేశంలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదాల్లో ఇది ఒకటిగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను విమానయాన శాఖ అన్వేషిస్తోంది.