“ప్రతి ముప్పై సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు.. వ్యాపార వేత్తలు ఫ్యాషన్ అంటారు.. రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు.. కాని ప్రతి జనరేషన్లోనూ ఓ కొత్త థాట్ని ముందుకు తీసుకువెళ్లే వాడు మాత్రం ఒక్కడే వస్తాడు.. వాడే టార్చ్ బేరర్”. అరవింద సమేతలోని ఈ టార్చ్ బేరర్ డైలాగ్ నారా లోకేష్ కు సరిగ్గా సెట్ అవుతుంది.
వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను నానా విధాలుగా వేధించారు. హత్యలు చేశారు. కేసులు పెట్టేందుకు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కితే మరో హత్య జరుగుతుందని బాధిత కుటుంబాలు నోరు తెరిచే సాహసం కూడా చేయలేదు. అలాంటి సమయంలో నారా లోకేష్ క్యాడర్ కు భరోసా కల్పించేందుకు యువగళం పాదయాత్ర చేపట్టారు. క్యాడర్ కు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడవద్దని, మిమ్మల్ని వేధించే వాళ్ల పేర్లను రెడ్ బుక్ లో రాయండి అంటూ ధైర్యాన్ని ఇచ్చారు. ఎర్రబుక్ డైలాగ్ టీడీపీ క్యాడర్ కు అంతులేని ధైర్యం ఇచ్చింది. టీడీపీ నేతృత్వంలో కూటమి పవర్ లోకి రావడానికి రెడ్ బుక్ దోహదం చేసిందనేది ఓపెన్ సీక్రెట్.
అందుకే.. తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ మంత్రి లోకేష్ రెడ్ బుక్ ను మరిచిపోలేకపోతున్నట్టు ఉంది. ఇదివరకు కవిత రెడ్ బుక్ అనలేదు కానీ, పింక్ బుక్ లో మిమ్మల్ని వేధించే వాళ్ల పేర్లు రాసుకోండి..అధికారంలోకి వచ్చాక అంతుచూస్తాం అంటూ కార్యకర్తలతో చెప్పుకొచ్చారు. తాజాగా హరీష్ కూడా లోకేష్ చెప్పినట్టుగానే రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్నాయని, ఇష్టారీతిన కేసులు నమోదు చేస్తుండటంతో వారి పేర్లు రెడ్ బుక్ లో రాసుకోండి అంటూ లోకేష్ డైలాగ్ ను వినిపించారు. దీంతో ప్రస్తుత రాజకీయాల్లో ఈ రెడ్ బుక్ థాట్ ను తీసుకొచ్చిన లోకేష్ ను ఈ కాలపు టార్చ్ బేరర్ అని అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు.