కేబినెట్ లో కొత్తగా చోటు దక్కించుకున్న మంత్రులకు ఎలాంటి శాఖలు ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే విషయంపై అధిష్టానంతో చర్చించేందుకు రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు సీఎం రేవంత్. ఈ నేపథ్యంలో అనూహ్యంగా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు రావడం ఆసక్తికరంగా మారింది.
అధిష్టానం పిలుపుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్ తోపాటు ఉత్తమ్ అభిప్రాయాలను హైకమాండ్ కోరనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే, కేబినెట్ లోని కొంతమంది మంత్రుల శాఖల మార్పు కూడా ఉంటుందని , అందుకే ఉత్తమ్ ను ఢిల్లీకి రావాలని కబురు పెట్టినట్లుగా సమాచారం.
కొత్త మంత్రులలో వివేక్ కు విద్యుత్ శాఖ, వాకిటి శ్రీహరికి క్రీడ , అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ సంక్షేమ శాఖలు అప్పగిస్తారు అని, అలాగే ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టికి హోం శాఖను అప్పగిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆర్థిక శాఖను భట్టి దగ్గరే ఉంచుతారా? మరొకరికి కేటాయిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.