హైదరాబాద్ శివార్లలో మంచి మౌలిక సదుపాయాలతో అభివృద్ది చేసే ప్లాట్లుగా హెచ్ఎండీఏ లే ఔట్లకు పేరు ఉంది. కొద్ది కాలంగా హెచ్ఎండీఏ ఇళ్ల స్థలాలను వేలం వేయలేదు. త్వరలో వేలానికి లే ఔట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం అనుమతి రావడమే తరువాయి.
ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో చాలా ప్రాంతాల్లో హెచ్ఎండీఏ లేఅవుట్లను డెవలప్ చేసింది. ఇళ్లను వెంటనే నిర్మించుకునేలా మౌలిక వసతులను కల్పించింది. తొర్రూరు, ప్రతాప్ సింగారం, ఇమ్ముల్నర్వ, లేమూరు వంటి ప్రాంతాల్లో ఈ లేఔట్లు ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ కింద రైతుల నుంచి భూములను సేకరించి వాటిని లేఅవుట్లుగా మార్చింది. 60-40 నిష్పత్తిలో అభివృద్ధి చేసిన ప్లాట్లను అక్కడి రైతులకే కేటాయించారు. హెచ్ఎండీఏకు లభించిన ప్లాట్లను వేలం ేయనున్నారు.
లేమూరులో 164 ప్లాట్లు, తొర్రూరులో 985 ప్లాట్లు , ప్రతాప్ సింగారంలో 793 ప్లాట్లు వేలం వేయనున్నారు. ఈ ప్లాట్ల కనీస ధర గజానికి రూ.20 నుంచి 30 వేల వరకూ ఉంటుంది. వేలంలో ఎవరు ఎక్కువ పాడితే వారికే దక్కుతాయి. మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేలా.. రెండు , మూడు వందల గజాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అందులే డిమాండ్ బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది. తక్కువ ధరలు.. ఎలాంటి వివాదాలు లేని..పూర్తి మౌలిక సదుపాయాలు ఉన్న లే ఔట్ లో స్థలం కావాలనుకుంటే ఇంత కంటే మంచి చాన్స్ ఉండకపోవచ్చు.