కల్వకుంట్ల కవిత వివిధ పనులు పెట్టుకుని జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లాలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రెబల్ గా మారడం వెనుక స్వంత ఎజెండా ఏమీ లేదని.. పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అని చెప్పుకొచ్చారు. బీజేపీ లో పార్టీ నీ విలీనం చేయొద్దని చెబుతున్నానని.. బీజేపీ తో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని గుర్తు చేశారు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి వ్యతిరేకమన్నారు.. నేను తాను జైల్లో ఉన్నప్పుడు బిజెపి లో కలుపుతామనీ చెప్పారని.. కానీ అస్సలే విలీనం ఒప్పుకోనని స్పష్టంచేశారు.
లెటర్ రాయడం లో తన తప్పేం లేదన్నారు. తాను కలిసి చెప్పాలనే ప్రయత్నం చేశానని.. కలిసే అవకాశం వచ్చింది కానీ చెప్పే అవకాశం రాలేదన్నారు. లెటర్ బయటికి తెచ్చిన వారిని పట్టుకోవాలని మరోసారి స్పష్టం చేశారు. మంచిర్యాలలో అనారోగ్యంతో చనిపోయిన ఓ జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కూడా బీజేపీపై విమర్శలు చేశారు. ఆపరేషన్ కగార్ పేరిట బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం కూడ లేదు బీజేపీ పార్టీకి లేదన్నారు.
కాంగ్రెస్ పైనా విమర్శలు చేశారు. ఎంపీ వంశీని సరస్వతి నది పుష్కరాలకు ఆహ్వానించకుండా కాంగ్రెస్ దళిత వ్యతిరేక వైఖరికి బయటపెట్టుకుందని విమర్శించారు..ధనం కన్నా, పదవి కన్నా, కులం గొప్పదంటూ అవమానం జరిగిందని ఎంపీ వంశీ బాధపడ్డారని.. సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో కూడా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అవమానించారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఖరి సమసమాజ నిర్మాణానికి, ప్రగతిశీల దృక్పథానికి వ్యతిరేకమన్నారు.
బీజేపీలో విలీనం చేయాలని కేసీఆర్ అనుకుంటే.. కవిత ఒప్పుకోను అంటే ఆగే అవకాశం లేదు. కావాలంటే ఆమె ఇతర పార్టీల్లో చేరిపోవచ్చునని చెబుతారు. కానీ విలీన ప్రక్రియ ఉందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.