ఐఏఎస్ అధికారులు తమకు నచ్చిన రాష్ట్రాల్లో పని చేయడానికి తమ పలుకుబడి అంతటిని ఉపయోగిస్తున్నారు. ఏపీ క్యాడర్ లో పని చేస్తున్న కాట అమ్రపాలి తీవ్ర ప్రయత్నాలు చేసి మళ్లీ తెలంగాణ క్యాడర్ కు మారిపోయారు. ఈ మేరకు డీవోపీటీ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆమె ఏపీ క్యాడర్ ఐఏఎస్గా ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమెను ఏపీకి కేటాయించారు. సివిల్స్ కు దరఖాస్తు చేసిన సమయంలో పర్మినెంట్ అడ్రస్ను విశాఖపట్నంగా నమోదు చేశారు. ఆ కారణంగా ఆమెకు ఏపీ క్యాడర్ ను కేటాయించారు.కానీ అలా రాసినా తాము చిన్నప్పటి నుండి హైదరాబాద్లోనే పెరిగామని తెలంగాణ క్యాడర్ కావాలని వారు క్యాట్, డీవోపీటీల్లో పిటిషన్లు వేసి పోరాడారు. చాలా ఏళ్ల తర్వాత అలా కుదరదని తీర్పు వచ్చింది. అందుకే ఏపీలో చేరాల్సి వచ్చింది.
కేంద్ర సర్వీసులకు వెళ్లి కిషన్ రెడ్డి ఓఎస్డీగా.. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలోనూ పని చేసిన ఆమె.. తర్వాత తెలంగాణ క్యాడర్ కు వచ్చారు. రేవంత్ ప్రభుత్వంలో ఆమెకు ప్రాధాన్యత లభించింది. గ్రేటర్, హెచ్ఎండీఏ వంటి బాధ్యతలు లభించాయి. కానీ ఉన్నపళంగా ఏపీకి పోవాల్సి రావడంతో ఆ ప్రాధాన్యత అంతా తగ్గిపోయింది. ఏపీలోనూ ఆమెకు మంచి శాఖనే కేటాయించినా.. ఎక్కువగా సెలవుల్లోనే ఉండి.. మళ్లీ తెలంగాణకు వెళ్లేందుకు తన ప్రయత్నాలు చేశారు. చివరికి సక్సెస్ అయ్యారు.