“ అత్యంత విశ్వసనీయ, ప్రభుత్వం ధృవీకరించిన వార్తలనే” ఇవ్వండి అని సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా భారత ప్రభుత్వం పలుమార్లు అడ్వయిజరీలు రిలీజ్ చేసింది. ప్రత్యక్ష ప్రసారాలు వద్దని ..భారత సైన్యం కదలికల్ని చూపించవద్దని కోరింది. అయితే మీడియా మాత్రం ఎవరి స్టాండర్డ్స్ వారు డిసైడ్ చేసుకుని ఆ ప్రకారం ముందుకెళ్లిపోయారు. భారత మీడియానే కాదు పాకిస్తాన్ కూడా అంతే. చివరికి పరిస్థితి ఎలా అయిందంటే.. అసలు జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన సమాచారం కన్నా ఫేక్ వార్తలే ఎక్కువగా వెళ్లిపోతున్నాయి. నమ్మేవాళ్లు నమ్ముతారు కదా అన్నట్లుగా చెలరేగిపోతున్నారు.
భారత్ తో యుద్ధం చేయించేసిన మీడియా
భారత తన సైనిక విధానంపై స్పష్టంగా ఉంది. ఇప్పటికైతే.. దాడికి ప్రతిదాడి అనే పద్దతిలో ఉంది. ఇంకా నేరుగా దాడులు చేయలేదు. పాకిస్తాన్ చేసే కుట్రల్ని డ్రోన్లను ఎప్పటికప్పుడుకూల్చివేస్తోంది. ఇంకా పూర్తి స్థాయి చర్యలు ప్రారంభం కాలేదు. కానీ మీడియా మాత్రం పాక్ ఆక్రమిత కశ్మీర్ కు భారత్ విముక్తం చేసేసిందన్న ప్రకటన నుంచి దగ్గర నుంచి పాకిస్తాన్ అధ్యక్షుడ్ని ఆజ్ఞాతంలోకి పంపే వరకూ చాలా విజయాలను భారత్ ఖాతాలోకి వేసేసింది. ఒక్క రాత్రిలో యుద్ధాన్ని ముగించేయాలని అనుకుంది. ఓ చానల్ ను మించి మరో చానల్ ఇలా తప్పుడు వార్తుల్ని హైలెట్ చేశారు. వీటిని నమ్మిన వారంతా బకరాలయ్యారు.
పాకిస్తానీ ఫేక్ వార్కూ బలం
మరో వైపు పాకిస్తాన్ వైపు నుంచి ఫేక్ వార్ కూడా నడుస్తోంది. భారత యుద్ధ విమానాల్ని కూల్చివేశామని చెబితే ఇక్కడవారు నమ్మేసి ప్రచారం చేశారు. ఓ వైపు పాకిస్తాన్ అధికారికంగా తాము దాడులు చేయడం లేదని అంటోంది. కానీ ఫేక్ న్యూస్ లో మాత్రం.. భారత్ కు ఎంతో నష్టం చేశామని అంటోంది. సరిహద్దుల్లో కాల్పులు జరిపి.. సరిహద్దు పౌరులపై ఎటాక్ చేయడం మినహా పాకిస్తాన్ చేసిందేమీ లేదు. అయినా ఫేక్ ప్రచారంలో రాటుదేలిపోయారు. వాటిని నమ్ముతూ ఇక్కడ ప్రచారం చేసేవారు వేరే లెవల్.
ఇప్పుడు నిజాలు చెప్పినా నమ్మలేని పరిస్థితి
రాజకీయాలపై ఊహాగానాలు వేస్తూ.. ఏ రాజకీయ పార్టీకి అనుకూలమైతే.. ఆ రాజకీయ పార్టీ కోసం తప్పుడు ప్రచారం చేయడానికి మీడియా చానళ్లు సిగ్గుపడేవి కావు. ఇప్పుడు అవసరం లేకపోయినా ఫేక్ న్యూస్, సెన్సేషనల్ న్యూస్ హైలెట్ చేస్తున్నాయి. యుద్ధం అనేది అత్యంత సున్నితమైనది. ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీడియాకు ఒకరు చెప్పాల్సిన పని లేదు. కానీ ఎంత జాగ్రత్తలో ఉండాలో అంత అజాగ్రత్తగా..ఎంత బాధ్యతగా ఉండాలో అంత కంటే ఎక్కువగా బాధ్యత లేకుండా మీడియా వ్యవహరిస్తోంది. ఇప్పుడు నిజంగా జరిగినా టీవీల్లో వచ్చే బ్రేకింగ్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది.