ఐపీఎల్ ఫైనల్ లో బెంగళూరు విజయకేతనం ఎగరవేయగానే… దేశం మొత్తం సంబరాలు చేసుకొంది. జనాలు రోడ్లపైకొచ్చి కేరింతలు కొట్టారు. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. 18వ నెంబరు జెర్సీలతో కళకళలాడిపోయాయి వీధులన్నీ.
ఇదేం వరల్డ్ కప్ కాదు. జస్ట్ ఐపీఎల్. కానీ ఏదో ప్రపంచ కప్ గెలిచినంత సంబరం. గెలిచింది బెంగళూరే. కానీ దేశం మొత్తం ఊగిపోయింది. అదీ.. కింగ్ కోహ్లీకి ఉన్న క్రేజ్. బెంగళూరు జట్టు మొత్తం అతని కోసం ఆడింది. దేశం మొత్తం అతని గెలుపుని ఆకాంక్షించింది. అందుకే ఇంత ఆనందం.. ఉద్వేగం.
20 వ ఓవర్. 6 బంతుల్లో 29 కొట్టాలి. తొలి రెండు బంతులకూ పరుగులు రాలేదు. అక్కడే బెంగళూరు విజయం ఖాయం అచ్యింది. ఆ సమయంలో కెమెరా కళ్లన్నీ కోహ్లీని ఫోకస్ చేశాయి. లోలోపల నుంచి వస్తున్న ఆనందాన్ని, కన్నీటి భాష్పాల్నీ క్యాప్చర్ చేశాయి. ఇన్నేళ్ల కెరీర్లో కోహ్లీని ఇంత ఉద్వేగంగా ఎప్పుడూ చూడలేదు. ఆఖరికి వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచినప్పుడు కూడా ఇంతటి ఎమోషన్ అవ్వలేదు. మ్యాచ్ అవ్వగానే కోహ్లీ ఓ చిన్నపిల్లాడైపోయాయి. గ్రౌండ్ అంతా కల తిరుగుతూనే ఉన్నాడు. `ఈరోజు ఓ పసిపాపలా నిద్రపోతా` అని ఉద్వేగంగా చెప్పాడు. ఔను… నిన్నటి రాత్రి కోహ్లీ హాయిగా నిద్రపోయి ఉంటాడు. ఎందుకంటే 18 ఏళ్ల కల తీరింది.
కోహ్లీ చూడని విజయాలా? కొట్టని కప్పులా? ఒక్క ఐపీఎల్ రాగానే ఎందుకిలా పసిపిల్లాడైపోయాడు? అని అడిగితే చాలా విషయాలు చెప్పాల్సివస్తుంది. బెంగళూరు స్టార్ ప్లేయర్ల ఫ్రాంచైజీ. ప్రపంచంలోనే అగ్రశ్రేణి బ్యాటర్లు, బౌలర్లు ఈ జట్టు తరపున ఆడేవాళ్లు. ప్రతీసారీ బెంగళూరు హాట్ ఫేవరెట్. `ఈసారి కప్పు మనదే` అన్నంత హడావుడి. కానీ ప్రతీసారీ వైఫల్యమే. మూడుసార్లు ఫైనల్లో చతికిలపడ్డారు. కొన్నిసార్లు ప్లే ఆఫ్ నుంచి వెనక్కి వెళ్లిపోయేవాళ్లు. ఇంకొన్నిసార్లు లీగ్ దశలోనే ఇంటి మొహం పట్టేవాళ్లు. పేపర్ పై చూస్తే జట్టు అద్భుతంగా ఉండేది. క్రిస్ గేల్, డివీలియర్స్, మాక్స్వేల్.. ఇలా ప్రపంచంలోని భయంకరమైన హిట్టర్లంతా ఒకే జట్టులో ఉండేవాళ్లు. దానికి తోడు కోహ్లీ. కానీ ఎప్పుడూ కలసి కట్టుగా మాత్రం ఆడలేకపోయేవాళ్లు. బ్యాటింగ్ని నమ్ముకొని బౌలింగ్ ని వదిలేసేవాళ్లు. ముఖ్యంగా స్పిన్నర్లని వెదికి పట్టుకోవడంలోనూ, కొత్త ఆటగాళ్లని తీర్చిదిద్దడంలోనూ ఆర్సీబీ వెనుకబడిపోయేది. దాంతో.. పేపర్ పై పులిలా కనిపించే జట్టు.. మైదానంలో ఒక్కోసారి పిల్లిలా మారిపోయేది. అభిమానులే ఆర్సీబీ బలం.. బలహీనత. ఎక్కడకు వెళ్లినా ఆర్సీబీ జట్టుకు హారతులు పట్టేవాళ్లు. కోహ్లీ సేన వెంట నిలిచేవాళ్లు. అది మరింత ఒత్తిడినిచ్చేది.
17 టోర్నీల్లో ఒక్కసారి కూడా కప్పు ముట్టుకోలేకపోయిన బాధ కోహ్లీని వెంటాడింది. ఐపీఎల్ లో ఇన్ని సీజన్లు ఒకే జట్టు తరపున ఆడిన ఆటగాడు కూడా కోహ్లీనే. కప్పు కొట్టకుండా ఆర్సీబీ జెర్సీ తీసేదే లేదు.. అని ఫిక్సయిపోయాడు. అందుకే ఎన్ని అవమానాలు ఎదురైనా జట్టు కోసమే పోరాడాడు. కెప్టెన్సీ వదులుకొన్నాడు. ఆటగాళ్లలో ఆటగాడిలా కలసిపోయాడు. ఈసారి ఆర్సీబీకి చాలా అంశాలు కలిసొచ్చాయి. యువ ఆటగాళ్లు లయ అందుకొన్నారు. మాక్స్ వేల్, డివీలియర్స్ లాంటి స్టార్లు లేకపోయినా, టీమ్ డేవిడ్, లివింగ్ స్టోన్ లాంటి హిట్టర్లు సరిగా ఆడకపోయినా.. మిగిలినవాళ్లు ఆ లోటు భర్తీ చేశారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగం పటిష్టంగా తయారైంది. అహ్మదాబాద్ లాంటి పిచ్ పై 190 పరుగుల్ని కాపాడుకోవడం అంటే మాటలు కాదు. కీలకమైన సమయంలో బౌలర్లు కలసి కట్టుగా రాణించడంతో కోహ్లీ కల సాకారమైంది.
అందుకే కోహ్లీ అంత సంబరపడిపోతున్నాడు. వరల్డ్ కప్ మళ్లీ గెలిచిన ఆనందం అతనిలో కనిపిస్తోంది. కప్ కొట్టకుండా రిటైర్ అయిపోతానేమో అనే బెంగలో ఉన్న కోహ్లీకి.. ఇది నిజంగా మధురమైన విజయమే. కోహ్లీ మళ్లీ ఐపీఎల్ లో కనిపిస్తాడా, ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనేది తరువాతి సంగతి. ఇప్పటికైతే.. సీజన్ 19 వరకూ బెంగళూరు అభిమానులు ఈ విజయాన్ని నెమరు వేసుకొంటూనే ఉంటారు.