దళితుడు సింగయ్యను తొక్కి చంపేసిన కేసులో జగన్ మోహన్ రెడ్డి ఉపయోగించిన బుల్లెట్ ఫ్రూఫ్ కారును పోలీసులు సీజ్ చేశారు. తాడేపల్లి ఇంట్లో ఉన్న కారును పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్లారు. ఈ కేసులో జగన్కు నోటీసులు జారీ చేశారు. స్వయంగా జగన్ కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. వైసీపీ కార్యాలయ ఇంచార్జ్ అప్పిరెడ్డి నోటీసులు తీసుకున్నారు. ఆ నోటీసుల్లో ఏమి ఉంది.. విచారణకు రావాలని పిలిచారా లేదా అన్నది బయటకు రాలేదు.
సత్తెనపల్లి పర్యటనకు వెళ్లేటప్పుడు జగన్ కారు కింద సింగయ్యపడ్డారు. ఆయనను లాగి రోడ్డు పక్కన పడేసి అందరూ ఎవరి దారిన వారు పోయారు. పోలీసులు వ్యూహాత్మకంగా తప్పుడు సమాచారం ఇచ్చారు. వేరే వాహనం ఢీకొన్నదని చెప్పారు. పోలీసులు కూడా మీడియాకు అదే చెప్పారు. కానీ నాలుగు రోజుల తర్వాత వీడియోలు వెలుగులోకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కూడా తన వాహనం కిందనే పడినట్లుగా అదే రోజు తెలిసిందని ట్వీట్ చేశారు. కానీ వీడియోలు బయటకు వచ్చే వరకూ ఆయన మాట్లాడలేదు.
అప్పుడే ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బతికి ఉండేవారన్న అభిప్రాయం ఉంది. అందుకే ఇలాంటి కేసుల్లో భారతీయ న్యాయ సంహిత ప్రకారం కఠినమైన సెక్షన్లు పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విచారణకు పిలవాల్సి ఉంది. ఆయన నిబంధనలకు ఉల్లంఘించి ర్యాలీ చేశారు.. గాయపడిన కార్యకర్తను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు.. ఇలా పలు సీరియస్ అభియోగాలు ఆయనపై ఉన్నాయి. పోలీసులు ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది.