అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలనలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జోసెఫ్ కెంట్ తన పదవికి సంచలన రాజీనామా చేశారు. ఇరాన్తో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన అంతరాత్మ సాక్షిగా ఈ యుద్ధాన్ని సమర్థించలేనని, అమెరికా ప్రయోజనాలకు సంబంధం లేని ఈ పోరాటంలో సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడం భావ్యం కాదని ఆయన తన రాజీనామా లేఖలో కుండబద్ధలు కొట్టారు.
ఇజ్రాయెల్ కోసం అమెరికాకు నష్టం చేస్తున్న ట్రంప్
ఈ రాజీనామా లేఖలో కెంట్ చేసిన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ఇరాన్ వల్ల అమెరికాకు తక్షణ ముప్పు ఏమీ లేదని, కేవలం ఇజ్రాయెల్ లాబీ ఒత్తిడి, అమెరికా మీడియాలోని కొందరు వ్యక్తులు సృష్టించిన తప్పుడు సమాచారం వల్లే ట్రంప్ ఈ యుద్ధంలోకి దిగారని ఆయన ఆరోపించారు. గతంలో ఇరాక్ యుద్ధం సమయంలో జరిగిన పొరపాట్లనే ఇప్పుడు మళ్ళీ పునరావృతం చేస్తున్నారని, ఇదంతా ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర అని ఆయన లేఖలో ఘాటుగా విమర్శించారు.
ప్రపంచ దేశాల దారి శాంతి – మరి అమెరికా ఎందుకు?
వ్యక్తిగతంగా కూడా ఎంతో నష్టపోయిన కెంట్, తన రాజీనామా వెనుక ఉన్న ఆవేదనను లేఖలో పొందుపరిచారు. 2019లో సిరియాలో జరిగిన బాంబు దాడిలో తన భార్య షానన్ కెంట్ను కోల్పోయిన ఆయన, ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం రూపొందించిన యుద్ధంలో తర్వాతి తరాన్ని బలి ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ లేదా ఇతర ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటున్న తరుణంలో, అమెరికా అస్థిరత వైపు వెళ్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు.
ట్రంప్ కళ్లు తెరుస్తారా? మరింత మూర్ఖంగా మారుతారా?
ట్రంప్ ప్రభుత్వానికి అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న కెంట్ నిష్క్రమణ, వైట్ హౌస్లో ముందెన్నడూ లేని విధంగా అంతర్గత సంక్షోభాన్ని సృష్టించింది. ముఖ్యంగా ఇరాన్ యుద్ధంపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ, నిఘా విభాగం అధిపతి ఇలాంటి ఆరోపణలతో తప్పుకోవడం ట్రంప్ విదేశాంగ విధానానికి పెద్ద సవాలుగా మారింది. ఈ పరిణామం యుద్ధ వ్యతిరేక నిరసనలకు మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

