కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కవిత ఫైర్ అయ్యారు. ఐదో తేదీన కేసీఆర్ కమిషన్ ముందు హాజరవనున్నారు. నాలుగోతేదీన భారీగా నిరసనలు చేపట్టాలని కవిత నిర్ణయించారు. అయితే ఈ నిరసనలు ఏవీ బీఆర్ఎస్ తరపున ఆమె పిలుపునివ్వలేదు. తెలంగాణ జాగృతి తరపునే నిరసనలకు పిలుపునిచ్చారు. ఆమె ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ నేతలు స్వాగతించడం లేదు.. కనీసం సమావేశం అయ్యేందుకు రావడం లేదు. పూర్తిగా సొంత క్యాడర్, అనుచరులతోనే ప్రస్తుతానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కేసీఆర్ కు నోటీసులు ఇస్తే.. కేటీఆర్ ఓ ట్వీట్ వేసి సర్దుకున్నారని అదే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు వస్తే మాత్రం ధర్నాలకు పిలుపునిచ్చారని కవిత రెండు రోజుల కిందట వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేసీఆర్ కోసం ఆమె రంగంలోకి దిగారు. కేసీఆర్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని ఆరోపిస్తున్నారు. కవిత నిరసనల వ్యవహారం బీఆర్ఎస్ లోనూ హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ కు వచ్చిన కాళేశ్వరం కమిషన్ నోటీసుల గురించి ఎవరూ పెద్దగా స్పందించలేదు. నిరసనల దాకా ఆలోచించలేదు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే స్పందించే విధానం ఇదేనా అన్న నిష్ఠూరాలు ఇందుకే వినిపించాయి.
తండ్రి కేసీఆర్పై తనకు లెక్క లేనంత అభిమానం ఉందని కేటీఆర్ కే లేదని కవిత నిరూపించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నోటీసుల వ్యవహారాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారని అనుకోవచ్చు. నాలుగో తేదీన ఆమె పిలుపు మేరకు ఎంత మంది నిరసనలు చేస్తారన్నదాన్ని బట్టి క్షేత్ర స్థాయిలో ఆమె బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ కోసం చేస్తున్నప్పటికీ ఈ నిరసనల్లో బీఆర్ఎస్ క్యాడర్ పాల్గొనే అవకాశం లేదు.