బీఆర్ఎస్ రెండు ముక్కలు అయింది. కవిత చేపట్టిన మహాధర్నా సాక్షిగా అది నిరూపితమైంది.కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కవిత నేతృత్వంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ హాజరు కాలేదు. కేవలం కవిత కోటరీ, జాగృతికి సంబంధించిన నేతలు మాత్రమే హాజరయ్యారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు దూరంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కవిత ధర్నాకు వెళ్లవద్దని పార్టీ హైకమాండ్ నుంచి సంకేతాలు రావడంతోనే నేతలు వెనక్కి తగ్గారని టాక్ బయటకు వచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీ నేతలు కొంతమంది తప్పుబడుతున్నారు. కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇవ్వడంతో కవిత ధర్నాకు చేపట్టారని, అలాంటప్పుడు ఆ ధర్నాలో పాల్గొనవద్దని ఆదేశాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అంతర్గత వ్యవహారంగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో పార్టీలో కవిత రేపిన కాక బీఆర్ఎస్ ను రెండు ముక్కలు చేసేదిలా ఉందన్న వాదనకు తాజా కార్యక్రమం బలం చేకూర్చుతోంది.
ఇప్పటికే బీఆర్ఎస్ గొడుగు కింద రాజకీయాలు చేసేందుకు కవిత అనాసక్తిగా చూపిస్తున్నారు. తన పవర్ ఏంటో చూపించాలని ఆమె ఆరాటపడుతున్నారు. ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఒకవేళ పార్టీని ఏర్పాటు చేసినా కేసీఆర్ చరిష్మాను వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందుకే బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్ కు మద్దతుగా మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ద్వారా బీఆర్ఎస్ రెండుగా చీలిపోయిందని స్పష్టం అవుతోంది.