తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన పొలిటికల్ లాంచింగ్ భిన్నంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముందుగా జాగృతిని బలోపేతం చేసుకుంటున్నారు. ప్రతి రోజూ..తెలంగాణ జాగృతి ఆఫీసులో చేరికలు జరుగుతున్నాయి. మరో వైపు కొత్తగా జాగృతిలో ఉండే వారికి ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభించారు. లీడర్ అనిపించుకోవాలంటే.. ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలా ప్రజాపోరాటాలు చేయాలి.. అనే దానిపై ప్రత్యేకమైన శిక్షణా తరగతులను జాగృతి క్యాడర్ కు అందించాలని నిర్ణయించారు.
పార్టీలోకి యువతను ఆకర్షించడానికి కవిత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారని అనుకోవచ్చు. బీఆర్ఎస్ తోసంబంధం లేకుండా కవిత జాగృతిని బలోపేతం చేసుకుని జాగృతి పేరుతోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొ నడం లేదు. కానీ మా పార్టీ బీఆర్ఎస్ అంటున్నారు. కేటీఆర్ ను కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు.
బీఆర్ఎస్ లో ప్రాధాన్యం లేకపోవడం వల్ల .. పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం వల్ల కవిత సొంత రాజకీయాలు చేస్తున్నారు. ఈ అంశంపై కేసీఆర్ కు అసంతృప్తి ఉన్నా కవిత తగ్గడం లేదు. ఫామ్ హౌస్ కు వెళ్లినా కేసీఆర్ మాట్లాలడలేదు. దీంతో ఆమెకు కేసీఆర్ మద్దతు లేదని చెబుతున్నారు. కానీ కవితపై చర్యలు తీసుకునే అవకాశం కనిపించడం లేదు. కవిత ఏదైనా సొంత రాజకీయ ప్రకటన చేస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.