“బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు కుట్ర చేస్తున్నారు..పార్టీలో లీకువీరులు చెప్పమంటే గ్రీకువీరుల్లాగా ఫోజులు కొడుతున్నారు”కవిత చేసిన ఈ కామెంట్స్ బీఆర్ఎస్ లో మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇక దాగుడుమూతలు ఎందుకు అనుకున్నారేమో, డైరెక్ట్ గా కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు కవిత. ఎక్కడా కేటీఆర్ పేరు ప్రస్తావించకపోయినా ఆమె వ్యాఖ్యల సారాంశం కేటీఆర్ ను టార్గెట్ చేసినట్లుగానే ఉంది.
పార్టీలో ఓ నాయకుడికి నోటీసులు ఇస్తే ఎమ్మెల్యేలంతా వెళ్లి సంఘీభావం తెలిపారు. కేసీఆర్ కు ఇస్తే ఎందుకు వెళ్లరని కవిత ప్రశ్నించారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేస్తే ఎమ్మెల్యేలంతా ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసినా ఎవరూ స్పందించలేదు. అయితే, కేసీఆర్ ఫామ్ హౌజ్ కు నో ఎంట్రీ బోర్డు ఉంటుంది కనుకే, ఎమ్మెల్యేలు ఆయన్ను కలిసేందుకు సిద్దపడలేదు. ఈ విషయాలు కవితకు తెలియనివి కావు. అయినా ఆమె ఈ కామెంట్స్ చేశారంటే.. కేటీఆర్ తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దపడినట్లేననేది క్లియర్.
సోషల్ మీడియాలో ఇంటి ఆడపడచు మీద చిల్లర పోస్టింగ్ లు చేయిస్తున్నారు అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పెయిడ్ చానెల్స్ లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆమె గరంగరం అయ్యారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో పెను ప్రకంపనలు రేపుతోన్నాయి. మరోవైపు .. బీఆర్ఎస్ – బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ చేస్తున్న వాదనకు కవిత కామెంట్స్ బలం చేకూర్చేవే. అందుకే ఆలస్యంగా చేయకుండా కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఆమె విషయంలో వేచిచూసే ధోరణితో ఉంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని లెక్కలు వేస్తున్నట్టు సమాచారం.
కేటీఆర్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండటంతో ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి ఇదే సరైన సమయమని, ఆయన వచ్చాక నోటీసులు ఇస్తే టోటల్ ఇష్యూ కేటీఆర్ కు అంటుకునే ప్రమాదం ఉందన్న భావనలో బీఆర్ఎస్ బాస్ ఉన్నట్లు వినికిడి. దీంతో ఏ క్షణమైనా కవితకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.