కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లే సమయంలో కేసీఆర్ వెంట కవిత కూడా ఉంటారు. కేసీఆర్ విచారణకు బయలుదేరే ముందు ఉదయం భర్త అనిల్ కుమార్ తో కలిసి కవిత ఫామ్ హౌస్ కు వచ్చారు. అలాగే కేసీఆర్ మనవడు , కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా.. బీఆర్కే భవన్కు కేసీఆర్ వెంట వెళతారు. పార్టీ ముఖ్యనేతలంతా కేసీఆర్ వెంట ఉండేలా చూసుకుంటున్నారు.
కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు వచ్చిన తర్వాత కవిత .. ఫామ్ హౌస్ వైపు వెళ్లలేదు. ఆమె కలవాలనుకోలేదో..కేసీఆర్ చాన్సివ్వలేదో స్పష్టత లేదు. అయితే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై జాగృతి తరపున ఆమె ఆందోళనలు చేశారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే.. తెలంగాణకు ఇవ్వడమేనని కవిత వాదిస్తున్నారు. ఈ క్రమంలో విచారణకు వెళ్లినప్పుడు కేసీఆర్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నారు.
కవిత .. మిగతా అందరితో పాటు తాను కూడా బీఆర్కే భవన్ కు వస్తానని అంటే.. ఆపే అవకాశం లేదు. అలా ఆపితే ఇంకా సమస్యలు పెద్దవి అవుతాయి. అందుకే కవిత ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ కన్నా తాను ఎక్కువగా స్పందించానని కవిత ఓ సందేశం పంపుతున్నారు. ఇప్పుడు కూడా అలాగే స్పందించే అవకాశం ఉంది.
కేసీఆర్ తో పాటు విచారణ జరిగే బీఆర్కే భవన్ కు వెళ్లేందుకు వచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడి గాయపడ్డారు. ఆయన కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా తేలడంతో అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.