కాళేశ్వరం కమిషన్ ను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. తనకు ఇచ్చిన నోటీసులను వారం రోజుల పాటు వాయిదా వేయించుకుని మరీ తన వాదన వినిపించేందుకు కసరత్తు చేశారు. ఈ లోపు ఈటల రాజేందర్, హరీష్ రావు ఇచ్చిన వాంగ్ములాలు, కమిషన్ ఏ ఏ అంశాలపై ప్రశ్నలు అడుగుతుందో స్పష్టత తెచ్చుకుని పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజనీర్లు, నీటి పారుదల రంగ నిపుణులతో పాటు హరీశ్ రావుతోనూ కేసీఆర్ చాలా సార్లు సమావేశమయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు మరో దఫా తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత బీఆర్కే భవన్లోని కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ తెలియదు అని చెప్పడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది.
కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నలకూ తన మీదకు రాకుండా .. అంతా పద్దతిగా, రూల్స్ ప్రకారం జరిగిందని చెప్పుకునేలా ఆధారాలతో సహా వాదించడానికి సిద్ధమయ్యారు. ఏ మాత్రం తడబడినా అది మీడియాలో వైరల్ అవుతుంది. కాళేశ్వరం అనేది ప్రపంచ అద్భుతమని అందులో అవకతవకలే లేవని ఆయన చెప్పాలనుకుంటారు. అందుకే తగ్గ సరంజామాతో వెళ్లనున్నారు.