భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ తనదైన శైలిలో నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా చేశారు. ఆయన కమిషన్ ముందు హాజరవడం వల్ల ఆయన ఇమేజ్ కు సమస్య వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఆ నోటీసులు దూది పింజతో సమానం అని కేటీఆర్ కూడా చెప్పారు. ఈ మాటల్ని బట్టి కేసీఆర్ విచారణకు హాజరు కారని.. కావాలంటే ప్రశ్నలు పంపిస్తే సమాధానాలివ్వడమో లేకపోతే కోర్టుకు వెళ్లడమో చేస్తారని అనుకున్నారు.
కానీ తప్పించుకుంటే అక్కడేదో తప్పు జరిగిపోయిందని..దానికి కేసీఆరే బాధ్యుడని అందుకే తప్పించుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుంది. అందుకే కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు.ఐదో తేదీన రావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ కూడా నోటీసులు జారీ చేసింది.తాను హాజరవుతానని ఈటల రాజేందర్ ప్రకటించారు. కేసీఆర్ హాజరవుతున్నందున.. హరీష్ రావు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇంతకు ముందు ఈ ముగ్గుర్ని ప్రశ్నించకుండానే నివేదిక సమర్పించాలని జస్టిస్ పీసీ ఘోష్ అనుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే రెండు నెలల పాటు జస్టిస్ ఘోష్ కమిషన్ వ్యవధిని పొడిగించిన తర్వాత..నోటీసులు జారీ అయ్యాయి. ఈ ముగ్గుర్ని ప్రశ్నించిన తర్వాత నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఆ నివేదికను చూసిన తర్వాత ప్రభుత్వం కేసులు పెట్టడం లేదా చర్యలు తీసుకోవడమో చేస్తారు.