ఏదైనా మితంగా ఉంటేనే బాగుంటుంది.. అతి అయితే మొదటికే మోసం వస్తుంది. కేకే సర్వేస్ పేరుతో కిరణ్ కొండేటి అనే వ్యక్తి మొదట యూట్యూబ్ చానల్స్ లో సర్వేల పేరుతో విశ్లేషణలు చేసేవాడు. ఆయనకు ప్రజల వద్దకు వెళ్లి ప్రొఫెషనల్గా డేటా సేకరించే నెట్ వర్క్ ఉందని ఎవరూ అనుకోరు. కానీ ఆయన విశ్లేషించి 2019లోవైసీపీ భారీ విజయం వస్తుందని లెక్కలు చెప్పారు. ఏది నిజం అయింది. ఇటీవలి ఎన్నికలలోనూ ఆయన చెప్పింది నిజం అయింది. దాంతో ఆయన పేరు మార్మోగిపోయింది. కానీ హర్యానాతో పాటు మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన చెప్పిన సర్వేలు పూర్తి స్థాయిలో తప్పని తేలాయి. అంటే లాటరీ ప్రతి సారి తగలదు. ఎంత అదృష్టం ఉన్నా.. లాటరీల్లో వందకు వందశాతం స్ట్రైక్ రేట్ రాదు.
తనకు వచ్చిన పేరును..రాజకీయ పార్టీల బలహీనతల్ని , అజ్ఞానాన్ని జ్ఞానం అనుకునే సోషల్ మీడియా నెటిజన్ల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కేకే సర్వేస్ ను విస్తరిస్తున్నారు. ఓ కంపెనీ పెట్టేసుకుని ఆంధ్రజ్యోతి పేపర్ లో ఏకంగా హాఫ్ పేజీ యాడ్ ఇచ్చారు. అంతేనా ఇటీవల ఓ సర్వే కూడా రిలీజ్ చేశారు. అతి కూడా అతిశయోక్తితో కూడి ఉంది. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నా.. ఆయన చెప్పిన నంబర్లను ఎవరూ నమ్మడం లేదు. పర్సంటేజీల్లో ఇచ్చినా తేడాగానే ఉంది. ఇక మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇచ్చి… ఆయన చేస్తున్న కామెంట్లు ఆయన చేస్తుంది సర్వేలా లేకపోతే రాజకీయ వ్యాఖ్యలా అన్నది అర్థం కాని విధంగా మారాయి.
తన సర్వే సంస్థను విశ్వసనీయంగా మార్చుకోవాలనుకుంటే ముందుగా ఆయన చేయాల్సింది అన్ని రాజకీయపార్టీలకు దూరంగా ఉండటం. రాజకీయ వ్యాఖ్యలు మానుకోవడం. ఆరా అనే సంస్థ పేరుతో బాగా సంపాదించుకున్న మస్తాన్ అనే పెద్ద మని,ి తన క్రెడిబులిటి కోల్పోవడానికి ఒక్క ఎన్నికల ఫలితమే సరిపోయింది. కేకేకు కూడా అంతే. ఒకప్పుడు లగడపాటి రాజగోపాల్ భారీగా ఖర్చుపెట్టుకుని మనుషుల్ని.. ఏర్పాటు చేసుకుని మరీ ఖచ్చితమైన సర్వేలిచ్చారు. ఆయనే అడ్రస్ లేకుండా పోయారు. వ్యవస్థ లేకుండా వ్యక్తి మీద నిలబడితే కేకే సర్వేస్ అయినా అంతే. ఈ విషయాన్ని తెలుసుకుంటే.. కొంత కాలం ఉంటారు.. లేకపోతే ఆయన సర్వేలు సోషల్ మీడియా పోస్టులకు పరిమితమవుతాయి.