ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలకు వర్తింప చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు. ప్రత్యకంగా ఆయన ఈ విషయంపై కసరత్తు చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాల పెంపుపై అధికారుల టీమ్ను ఏర్పాటు చేశారు. మరిన్ని సంస్కరణలు తీసుకు రావాలని నిర్ణయించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ సంస్కరణలతో రాష్ట్ర పౌరులకు సైతం అనేక ప్రయోజనాలు కల్పించాలని.. సంస్కరణలతో ఆయా శాఖల పనితీరులో సానుకూల మార్పులు రావాలని నిర్దేశించారు. పౌరులకి అన్ని సేవలను ఒకేచోట అందించేందుకు.. ప్రత్యేకంగా సిటిజన్ సర్వీసెస్ మేనేజ్మెంట్ పోర్టల్ను రూపొందించాలని నిర్ణయించారు.
ప్రభుత్వ సేవలు పొందాలంటే… ప్రజలకు చుక్కలు కనిపించే పరిస్థితి ఉంది. బర్త్ సర్టిఫికెట్ దగ్గర్నుంచి ప్రతీ దాని కోసం.. ఎన్ని సార్లు ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాలో అంచనా వేయలేని పరిస్థితి. ఆన్ లైన్ కాలంలోనూ పరిస్థితి మెరుగుపడలేదు. దీనిపై.. ఈసేవలు అని.. మరొకటని.. చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పెద్దగా మార్పు ఉండటం లే్దు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో భాగంగా ప్రజలకు అందించే సిటిజన్ చార్టర్ను మెరుగు పరిస్తే… ఉన్నతమైన సేవలు అందించవచ్చని కేటీఆర్ భావిస్తున్నారు. ప్రత్యేకంగా సిటిజన్ సర్వీసెస్ మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో.. ప్రభుత్వం తరపున వారికి అందాల్సిన సేవలను పకడ్బందీగా అందించడంలో.. ముందు ఉంటే ప్రజలు కూడా సంతృప్తి పడతారని కేటీఆర్ భావిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకునే విధానంతో ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే వారి సంఖ్యను కూడా తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ విషయంలో కేటీఆర్ పక్కాగా ప్రణాళిక రూపొందిస్తే.. ఈజ్ ఆఫ్ డూయింగ్లో తెలంగాణ అటు వ్యాపార పరంగా.. ఇటు ప్రజాసేవల పరంగా.. మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉంది.