ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేశారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు.. కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశారని కేటీఆర్ వాదన. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ట్యాపింగ్ విషయంలో ఇలా కేటీఆర్ ఇతరుల్ని లీగల్ నోటీసులతో బెదిరించడం మొదటి సారి కాదు..గతంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ నేతల్ని కూడా ఇలాగే బ్లాక్ మెయిల్ చేశారు. మరోసారి మాట్లాడకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగింది. కానీ దర్యాప్తులో బయటపడుతున్న వివరాల తర్వాత కూడా కేటీఆర్ ఎలా అమాయకంగా లీగల్ నోటీసులు జారీ చేస్తారు ?
ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఒక్కరైనా నమ్ముతారా?
తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నమ్మేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు. దానికి తగ్గట్లుగా పరిణామాలు జరిగాయి. ఎన్నికల్లో ఒక్క పార్టీకి చెందిన వారి సొమ్మునే ఖచ్చితంగా అక్కడే ఉన్నాయని వెతికి..వెతికి పట్టుకోవడం దగ్గర నుంచి.. ఎమ్మెల్యే కొనుగోళ్ల వరకూ ప్రతీ అంశంలోనూ వారి ఆయుధం ట్యాపింగే. రాజకీయమే కాదు..వ్యాపార రంగంలోనూ ఈ ట్యాపింగ్ తో దందాలు చేశారు. సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యాపారవేత్త ఈ ట్యాపింగ్ వల్ల పడిన కష్టాలేంటో గతంలోనే ఫిర్యాదు చేశారు.
దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు
మన దేశంలో ట్యాపింగ్ చేయడం అంత తేలిక కాదు. కానీ దారి తప్పిన ప్రభుత్వాలు ఏమైనా చేయగలవు. ట్యాపింగ్ చేయాలంటే.. ముందుగా రివ్యూ కమిటీకి నెంబర్లు పంపారు. ఇలా.. మావోయిస్టు సానుభూతిపరుల పేరుతో పేర్లను ట్యాపింగ్ కు పంపి.. పని పూర్తి చేసేవారు. చాలా నెంబర్లకు అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసేవారు. ఓ సీఎం ఫోన్ కూడా ట్యాప్ చేశారంటే ఎంత బరి తెగించారో అర్థం అయిపోతుంది. దర్యాప్తులో ఎవరూ ఊహించనన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హార్డ్ డిస్క్ ధ్వంసం చేశాం కాబట్టి ఆధారాలు ఉండవని అనుకుంటున్నారు. కానీ జరిగిన ఘటనలే ఆధారాలుగా మారుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ ఎవరూ తప్పించుకోలేరు !
దేశంలో ఇప్పటి వరకూ ఫోన్ ట్యాపింగ్ కేసు నిరూపితం కాలేదు. కానీ ట్యాపింగ్ చేసి చేసిన తప్పుడు పనుల కేసులు మాత్రం నిరూపితం అవుతాయి. పోలీసుల వద్ద ఉన్న ఆధారాల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా నిరూపిస్తే సంచలనం అవుతుంది. అధికారంలో ఉన్న పార్టీలు .. మావోయిస్టు సానుభూతిపరుల పేరుతో ట్యాప్ చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే సాధ్యం కాని విధంగా ఈ కేసు ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని అనుకోవచ్చు.