కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కేటీఆర్ ను బాగా డిస్ట్రబ్ చేస్తున్నట్లుగా ఉంది. ఏ విషయం జరిగినా కాళేశ్వరం లింక్ పెడుతున్నారు. తాజాగా జూరాల ప్రాజెక్టులో గేట్లకు సంబంధించిన తాళ్లు తెగిపోవడం, హైదారబాద్ శివారులో మంజీరా బ్యారేజీ నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయని ఫోటోలు బయటకు రావడంతో చాలా పెద్ద ట్వీట్ పెట్టారు. అంత పెద్ద ట్వీట్ ఎందుకంటే.. కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజీలో వచ్చిన పగుళ్లు.. దీనికి పెద్ద తేడా లేదని చెప్పడానికి.
భారీ వరద వచ్చిన ప్పుడు ప్రాజెక్టులకు ఇలా జరుగుతూ ఉంటాయని.. ప్రభుత్వాలు వెంటనే రిపేర్లు చేయించాలని అంటున్నారు. మేడిగడ్డకు రిపేర్లు చేయించకపోవడంపై మండిపడ్డారు. జూరాలతో పాటు అన్ని ప్రాజెక్టులకు రిపేర్లు చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిర్వాకంతో ప్రాజెక్టులకు గడ్డు పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఇటీవల .. మధ్యప్రదేశ్ లో ఓ బ్రిడ్జి, బీహార్లో ఓ వాచ్ టవర్ నిర్మాణాలను కూడా కాళేశ్వరంతో పోల్చి చూశారు కేటీఆర్. ఆయన కాళేశ్వరం లో జరిగిన తప్పిదం చాలా చిన్నదని చెప్పడానికి.. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని నార్మలైజ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకే ఎలాంటి ఘటన జరిగినా కాళేశ్వరం లింక్ పెట్టి .. సహజమేనని చెబుతున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ.. ఎన్నికలకు ముందు కుంగిపోవడం బీఆర్ఎస్ పార్టీకి పెను సమస్యగా మారింది. లక్ష కోట్ల ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అది చాలా చిన్న సమస్య అని. రిపేర్ చేయించాలని బీఆర్ఎస్ అంటోంది. కానీ ఆ బ్యారేజ్ కుంగిపోయినంత వరకూ తీసేసి మళ్లీ నిర్మించాని ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది. మరో వైపు కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుగుతోంది. అన్నీ కలిసి కేటీఆర్ కు కాళేశ్వరం టెన్షన్ పట్టుకునేలా చేసిందని ఆయన ట్వీట్లు నిరూపిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.