తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బిజూజనతా దళ్కు చెందిన మాజీ ఎంపీ పినాకి మిశ్రాను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. జర్మనీలో దాదాపుగా నెల రోజుల కిందట జరిగిన ఈ పెళ్లి గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. పినాకి మిశ్రా వయసు అరవై ఐదు ఏళ్లు. ఆయనకు గతంలో పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒడిషాలోని పూరీ నుంచి గతంలో ఎంపీగా గెలిచారు. మహువా మొయిత్రా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా రెండో సారి వ్యవహరిస్తున్నారు. ఆమె వయసు యాభై ఏళ్లు.
యాభై ఏళ్ల మహువా.. అరవై ఐదేళ్ల మాజీ ఎంపీని పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గామారింది. దీనికి కారణం వయసు గ్యాప్ కాదు. మహువా మొయిత్రా.. దేశంలో మోదీని, బిజేపీ తీవ్రంగా వ్యతిరేకించి, విధానపరంగా విమర్శించడంలో గట్టి నాయకురాలిగా గుర్తింపు సాధించారు. ఆమెపై ఓ సారి అనర్హతా వేటు కూడా వేశారు. బీజేపీ ఎన్నో సార్లు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడింది.
విదేశాల్లో ఎక్కువగా చదువుకుని ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పని చేసిన మొయిత్రాకు కూడా ఇంతకు ముందే పెళ్లి అయింది. డానిష్ ఫైనాన్సియర్ లార్స్ బ్రోర్సన్ను వివాహం చేసుకుని, తర్వాత విడాకులు తీసుకున్నారు. తర్వాత జై అనంత్ అడ్వాకేట్ తో సుమారు మూడేళ్ల పాటు సహజీవనం చేశారు. పెంపుడు కుక్క విషయంలో వారి మధ్య వివాదాలు రావడంతో విడిపోయారు. జై అనంత తర్వాత ఆమె గురించి సమాచారం దర్యాప్తు సంస్థలకు ఇవ్వడంతో .. ఆ సమాచారం ఆధారంగా ప్రశ్నలకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఆమెపై అనర్హతా వేటు వేశారు లోక్ సభ స్పీకర్.
తర్వాత ఎన్నికల్లో మరోసారి ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్ లోకి అడుగు పెట్టారు. మహువా మొయిత్రా విషయ పరిజ్ఞానం, మంచి వాగ్దాటి ఉన్న నేత. దూకుడైన యువ ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రెండో సారి ఎంపీగా ఎన్నికైన తరవాత.. అలాంటి దూకుడైన ప్రసంగాలు కనిపించలేదు.