ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంది. అన్ని మీడియా చానళ్లు చంద్రబాబు ఇంటర్యూలు ఇచ్చాయి. జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే నేషనల్ చానళ్లు ప్రయారిటీగా చంద్రబాబు ఇంటర్యూలు తీసుకుని ప్రైమ్టైమ్లో ప్రసారం చేశాయి. తెలుగు మీడియాలో ప్రముఖ చానళ్లు, పత్రికలు ఇంటర్యూలు తీసుకున్నాయి. సాక్షి మీడియా ఎలాగూ తీసుకోదు కాబట్టి దాన్ని వదిలేస్తే.. మిగిలిన చానళ్లు టీవీ9, ఎన్టీవీలు చంద్రబాబు ఇంటర్యూలు కాదు కదా.. కూటమి పాలన గురించి నాలుగు మంచి మాటలు చెప్పడానికి కూడా మనసు రాలేదు.
జగన్ రెడ్డి ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని ఘోరాలు జరిగినా.. అహా.. ఓహో అని పొగిడారు. అంతేనా. చంద్రబాబు, లోకేష్ ల వ్యక్తిత్వంపై దాడి చేశారు. ఆధారాల్లేని స్కిల్ లాంటి కేసుల్లో అడ్డగోలు లాజిక్కులతో ప్రత్యేక కథనాలు వండి వార్చారు. చివరికి ఎన్నికలకు ముందు వైసీపీ గెలుస్తుందని సిగ్గు లేకుండా సర్వేలు కూడా వేశారు. ప్రభుత్వం మారిన తర్వాత .. ఇంకా జగన్ రెడ్డి గెలవలేదన్న బాధలోనే ఉన్నారు. కూటమి గెలిచిందన్న ఆవేదనలో ఉన్నట్లుగా ఉన్నారు.
ఇప్పుడు కూటమి లో చిచ్చు పెట్టడానికి ఏదైనా కథనం అవసరం అయితే వండి వారుస్తున్నారు కానీ.. ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పడానికి వారికి మనసు రావడం లేదు. తప్పుడు ప్రచారాలు చేయడానికి మాత్రం రెడిగా ఉంటున్నారు. ఏడాది పూర్తి అయినా ఈ రెండు చానళ్ల యజమానుల వ్యాపారాల్లోని అక్రమాలపై ఇంకా దృష్టి పెట్టలేదు కాబట్టే వీరంతా తమ పాత బాస్ కు మద్దతుగా ఉంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీకి ఈ రెండు చానళ్లు ఇప్పటికీ పరోక్షంగా కాదు.. ప్రత్యక్షంగానే మద్దతు పలుకుతున్నాయి. అయితే భయంతో.. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడం లేదు. గతంలోలా వ్యక్తిత్వాన్ని కించ పరిచే కథనాలు రావడంలేదు. అలాంటి కథనం ఒ!క్కటి వస్తే.. అసలు కథను టీడీపీ నేతలు ప్రారంభించే అవకాశం ఉంది.