ఇటీవలి కాలంలో కొన్ని నేర ఘటనలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిలో ఎక్కువగా విలన్లు.. మహిళలు, భార్యలే. తాజాగా దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలోనూ మార్మోగిపోతున్న పేరు సోనమ్ రఘువంశీ. తన భర్త రాజా రఘువంశీని హనీమూన్కు అని మేఘాలయ తీసుకెళ్లి అక్కడ అడవుల్లో సుపారీ గ్యాంగ్ తో చంపించేసి..తాను మాత్రం ప్రియుడితో గడిపేందుకు యూపీ వెళ్లిపోయింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఆర్థికంగా బలంగా ఉన్న రెండు రఘువంశీ కుటుంబాలు ఇప్పుడు తమ కుటుంబాల దుస్థితిని తల్చుకుని దిగులుపడుతున్నారు.
భార్యల దురాగతాల క్రైమ్ న్యూస్ వైరల్
ఒక్క సోనమ్ కాదు..ఇటీవల వారానికో క్రైమ్ కథ .. అదీ కూడా భార్యల ఘోరాలు వైరల్ అవుతున్నాయి. ఓ భార్య నేవీలో పని చేసే భర్తను ముక్కలు చేసి డ్రమ్ములో వేసి సిమెంట్ పోస్తుంది. మరో భార్య ప్రియుడితో కలిసి భర్తను పాము కాటు వేయించి చంపేస్తుంది. ఇలాంటివి చెప్పుకుంటే లెక్కలేనన్ని. వీటికి తోడు భార్యల వేధింపులకు భరించలేక ఆత్మహత్యలు చేసుకునే భర్తల సంఖ్య పెరిగిపోయింది. బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన పెను సంచలనం సృష్టించింది. అలాంటి ఆత్మహత్యలు తర్వాత పదుల సంఖ్యలో బయటకు వచ్చాయి. ఎప్పటికప్పుడు ఈ భార్యల దురాగతాలే వైరల్ అవుతున్నాయి.
పెళ్లి చేసుకోకపోవడం బెటర్ అంటున్న నెటిజన్లు
ఇలాంటి నేరాలతో చాలా మంది నెటిజన్లు భయపడుతున్నారు. తాము పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నామని… ఈ కాలం అమ్మాయిలు మారిపోయారని అంటున్నారు. పెళ్లి కాక ముందు శారీరక సంబంధం లేని అమ్మాయిలే ఉండటం లేదని కొంత మంది చాలెంజ్ చేస్తున్నారు. వివాహ వ్యవస్థకు అమ్మాయిల తీరుతో పెద్ద ముప్పు ఏర్పడిందని కామెంట్లు చేస్తున్నారు. మగాళ్ల బాధలను పట్టించుకునేవారు కావాలని అంటున్నారు. మహిళల నేరాల గురించి బయటకు వచ్చినప్పుడల్లా వివాహ వ్యవస్థతో పాటు మహిళల హక్కులపై చర్చ ప్రారంభమవుతోంది.
సమాజం మారలేదు.. తేడా సోషల్ మీడియానే
అయితే కాస్త లోతుగా ఆలోచిస్తే చాలా మంది సమాజం ఏమీ మారలేదని కొంత మంది గుర్తు చేస్తున్నారు. కోట్ల కుటుంబాలు ఉన్న దేశంలో వివాహ వ్యవస్థ చాలా బలంగా ఉంది. ఎక్కడో ఓ చోట జరిగే నేరాలతో మొత్తం వ్యవస్థకు ముప్పు వస్తుందని.. అందరూ అలాగే ఉంటారనుకోవడం మంచిది కాదని అంటున్నారు. అప్పటికి ఇప్పటికీ తేడా సోషల్ మీడియా మాత్రమే. విపరీతంగా జరిగే ప్రచారాల వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు.