వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఆరోగ్యంపై ఆయన కుమార్తె క్రాంతి ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారని.. తన సోదరుడు గిరి సరైన చికిత్సను చేయించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన ఓ మాజీ YSRCP ఎమ్మెల్యే తనను తండ్రిని కలవడానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. కానీ గిరి , అతని మామ నా తండ్రిని కలవడానికి అనుమతించలేదని ట్వీట్లో తెలిపారు.
తన తండ్రి ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. తమ దగ్గరి బంధువులకు, ముద్రగడ సన్నిహితులకూ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని క్రాంతి చెబుతున్నారు. గిరి, అతని బంధువుల ముద్రగడను బంధించి, ఒంటరిగా ఉంచుతున్నారని తెలిసిందని.. ఎవరూ ముద్రగడను సంప్రదించడానికి, మాట్లాడటానికి అనుమతించడం లేదని ఆరోపించారు. ఇది దారుణమని.. ఎంత మాత్రం సహించే విషయం కాదని క్రాంతి స్పష్టం చేశారు. రాజకీయ కారణాల కోసం ఇలా చేస్తున్నట్లయితే వదిలిపెట్టననని సోదరుడు గిరికి క్రాంతి హెచ్చరించారు. తన తండ్రి మెరగైన వైద్యం పొందడానికి అర్హుడని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభానికి వ్యతిరేకంగా క్రాంతి మాట్లాడారు. జనసేన పార్టీలో చేరారు. అప్పట్లో ముద్రగడ కూడా తన కూతురుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు లేనట్లుగా తెలుస్తోంది. అయితే ముద్రగడకు అనారోగ్యంగా ఉన్నా బయటకు చెప్పకపోవడం, కుమార్తెను చూసేందుకు అనుమతించకపోవడం వివాదాస్పదమవుతోంది. ఇటీవల వెన్నుపోటు దినంలో చాలా మంది పాల్గొన్నారని అందరికీ ధ్యాంక్స్ చెబుతూ ముద్రగడ పేరుతో లేఖ బయటకు వచ్చింది. అనారోగ్యం వల్ల తాను పాల్గొనలేకపోయానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ముద్రగడ వ్యవహారాలన్నీ వైసీపీ నేత ఆయన కుమారుడు గిరి చూసుకుంటున్నారు.