=ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు తరవాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇండస్ట్రీ నాలుగు స్తంభాలుగా ముందుకు సాగారు. తమకంటూ ఒక సొంత పంథా సృష్టించుకుని అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పటికీ ఈ నలుగురు హీరోల నుంచి వచ్చే సినిమాలపై అందరికీ ఆసక్తి వుంటుంది.
అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా నాగార్జున కొత్త ఆలోచన చేశారు. కేవలం హీరోగానే కాకుండా మంచి పాత్రలు చేయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో మనం, ఊపిరి లాంటి సినిమాలు చేశారు. లేటెస్ట్గా వచ్చిన ‘కుబేర’ లో అయితే ఇంకొ మెట్టు పైకి వెళ్లారు. ఒక్క హీరోయిజం షాట్ లేని సినిమా ఇది. దీపక్ పాత్రలో నాగార్జున అతి సామాన్యుడిగా కనిపించిన తీరు కొత్తగా వుంది. ఈ సినిమాతో మరో నలభై ఏళ్ళు నటుడిగా తనకు తిరుగులేదని, కొత్త ద్వారాలు తెరుచుకున్నాయని స్వయంగా చెప్పారు నాగ్.
ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాలో విలన్గా నటించారు నాగార్జున. ఇది నాగ్ కెరీర్లో మరో కొత్త అడుగు. ఇప్పుడు నాగార్జున ఆలోచనలన్నీ వేరుగా వున్నాయి. కేవలం హీరోయిజానికి తను అంకితం కావడం లేదని చెప్పకనే చెప్పారు. ఇక సినిమాల నిర్మాణంలో కూడా ఆయన దృష్టి వేరుగా వుంది. పెద్ద సినిమా అంటే ఆయన దృష్టిలో మంచి కంటెంట్, దర్శకుడు. ఈ రెండింటితోనే సినిమా పెద్దదిగా అవుతుందనే నమ్మకానికి వచ్చారు. కుబేర అనేది దీపక్ సినిమాగాని, నాగార్జున సినిమా కాదని సక్సెస్ మీట్ లో స్టేజ్పైన సగర్వంగా ప్రకటించారు. ఈ ప్రకటనలోనే నాగార్జున అభిమతం అర్థమౌతుంది.
ఇప్పుడు నాగార్జున క్రేజీ కాంబినేషన్ల వంక చూడటం లేదు. ఆయన వందో సినిమాను కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం కలిగిన ఓ దర్శకుడికి అప్పగించారు. దీని ద్వారా ఆయన ఆలోచన ధోరణి అర్థం చేసుకోవచ్చు.
సినిమాల ఎంపిక విషయంలో నాగార్జున అభిరుచి పూర్తిగా మారిపోయింది. అయితే, ఆయన సమకాలికులు క్రేజీ ప్రాజెక్ట్స్ను సెట్ చేసుకుని బిగ్ స్కేల్లో అభిమానులను అలరించే సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కోరిక కూడా ఇదే. నాగ్ తన అభిరుచికి తగ్గట్టు సినిమాలు చేసుకున్నా, అభిమానులను దృష్టిలో పెట్టుకొని సోలో హీరోగా బిగ్ స్కేల్లో సినిమాలు చేస్తే చూడాలని కొందరు అభిమానులు కోరుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నాగ్ ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు.