మంగళగిరిః మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీమణి శ్రీమతి నారా బ్రాహ్మణి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా మంగళగిరి పట్టణం గోలివారివీధిలో దామర్ల వేణు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన లక్ష్మీశారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ షోరూమ్ ను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి శ్రీమతి నారా బ్రాహ్మణి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా గోలివారివీధికి చేరుకున్న నారా బ్రాహ్మణికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య లక్ష్మీ శారీస్ వారి చేనేత వస్త్ర దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. షోరూమ్ మొత్తం కలియతిరిగి చేనేత వస్త్రాలను పరిశీలించారు. డిజైన్ లకు సంబంధించిన వివరాలను, చేనేతలకు అందుతున్న మద్దతు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. చేనేతకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు నారా లోకేష్ గారు గట్టి పట్టుదలతో ఉన్నారని, మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గోల్డ్ హబ్, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి, పార్క్ లు వంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా చెప్పారు. అందరం కలిసి చేనేత రంగాన్ని కాపాడుకుందామని అన్నారు. అనంతరం చేనేత చీరను కొనుగోలు చేశారు.
కాజ గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన శ్రీమతి నారా బ్రాహ్మణి
కాజ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్, ఈడబ్ల్యూఎస్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని శ్రీమతి నారా బ్రాహ్మణి సందర్శించారు. ముందుగా కుట్టు మిషన్ కేంద్రం వద్దకు చేరుకున్న నారా బ్రాహ్మణికి నిర్వాహకులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో శ్రీమతి నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు. శిక్షణ అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మిషన్ పై వారు కుట్టిన వస్త్రాలను పరిశీలించి మెచ్చుకున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. మన మంగళగిరి-మన లోకేష్, జై స్త్రీ శక్తి అంటూ ఈ సందర్భంగా మహిళలు నినదించారు.
మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్క్ సందర్శన
మంగళగిరి పట్టణం ఎస్ఎల్ఎన్ కాలనీలో 0.35 ఎకరాల్లో రూ.1.06 కోట్లతో మంత్రి నారా లోకేష్ గారు అభివృద్ధి చేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్క్ ను శ్రీమతి నారా బ్రాహ్మణి సందర్శించారు. పార్క్ మొత్తం కలియతిరిగారు. స్థానిక మహిళలు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్క్ ను చాలా బాగా అభివృద్ధి చేశారన్నారు. అనంతరం సరదాగా పార్క్ లో ఏర్పాటుచేసిన ఊయల ఊగారు.
ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను పరిశీలించిన శ్రీమతి నారా బ్రాహ్మణి
మంగళగిరి పట్టణం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దిగువ సన్నిధి వద్ద దివిస్ లేబరేటరీస్ సంస్థ సహకారంతో ఏర్పాటుచేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను శ్రీమతి నారా బ్రాహ్మణి పరిశీలించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఎగువ సన్నిధికి భక్తులు వెళ్లేందుకు ఉచితంగా ఏర్పాటుచేసిన ఎలక్ట్రిక్ బస్సును పరిశీలించారు. బస్సులోకి ఎక్కి భక్తులతో సంభాషించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.